ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జర్నలిస్ట్ అవత్తారమెత్తి...పాఠశాల సమస్యలు పరిష్కరించిన బుడతడు

national |  Suryaa Desk  | Published : Sun, Aug 07, 2022, 11:36 PM

పిల్లలే కాదా అని తేలికగా తీసుకొంటే  వారు దిమ్మతిరిగే షాకులు కూడా ఇస్తారు. ఇలాంటి షాకే ఓ 12 ఏళ్ల విద్యార్థి తనదైన శైలీలో ఇచ్చాడు. మన దేశంలో ప్రభుత్వ పాఠశాలల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాగడానికి నీరు ఉండదు. పోవడానికి దారి ఉండదు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ చెట్ల కిందే చదువులు సాగుతున్నాయి. భవనాలు శిథిలావస్థలో ఉంటాయి. కొన్ని బడుల్లో చదువు చెప్పేందుకు టీచర్లు ఉండరు. దాంతో పాఠశాలల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాగే జార్ఖండ్‌‌లోని ఓ బడిలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. దాంతో ఓ విద్యార్థి రిపోర్టర్‌గా మారి..స్కూల్లో సమస్యల గుట్టును విప్పి చెప్పాడు. అది కాస్తా వైరల్ అయింది.


గొడ్డా జిల్లాలోని మహ్గామా బ్లాక్‌లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అనేక సమస్యలు తాండవిస్తున్నాయి. దాంతో పాఠశాలలో విద్యార్థుల శాతం కూడా తగ్గిపోయింది. ఈ క్రమంలో అక్కడో విద్యార్థి జర్నలిస్ట్‌గా మారి.. అక్కడ సమస్యల గురించి తెలియజేశాడు. సర్ఫరాజ్ (12) అనే విద్యార్థి రిపోర్టర్ అవతారం ఎత్తి.. ఓ ప్లాస్టిక్ బాటిల్‌కు కర్ర తగిలించి మైక్ తరహాలో తయారు చేశాడు. దాన్ని పట్టుకుని నిజమైన జర్నలిస్ట్‌గా వారి బడిలో ఉన్న సమస్యల గురించి చెప్పాడు.


టీచర్లు సమయానికి క్లాసులకు రారని, తాగేందుకు నీళ్లు లేవని చెప్పారు. కేవలం నీళ్లు కోసమే విద్యార్థులు ఎక్కడికో వెళ్లాలని చెప్పాడు. అంతేకాదు పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయని, మరుగుదొడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని తెలియజేశాడు. అలా వారి పాఠశాలలో దుస్థితిని చక్కగా వివరించి చెప్పాడు. నిజమైన రిపోర్టింగ్‌లాగానే వీడియో చివర్లో కెమెరామెన్ పేరుతో పాటు తన పేరును కూడా చెప్పాడు.


అయితే అక్కడే ఉన్న ఓ వ్యక్తి దీన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాంతో ఈ వీడియోను చక్కర్లు కొడుతుంది. దీనిపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. పిల్లవాడు చేసిన తీరును మెచ్చుకుంటున్నారు. ఈ పిల్లవాడి నిజమైన "జర్నలిజానికి నా హృదయపూర్వక వందనం" అని ఒకరు కామెంట్ పెట్టారు. మరొకరు "ఆ బాలుడు నిజమైన జర్నలిస్టుగా మారడానికి అన్ని లక్షణాలు ఉన్నాయి" అని మరొకరు వ్యాఖ్యానించారు. అలాగే ఈ వీడియోని ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలని కామెంట్లు పెట్టి షేర్ చేస్తున్నారు.


అయితే సర్పరాజ్ రిపోర్టింగ్ వీడియోతో ఉన్నతాధికారులు స్పందించారు. జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారి రజినీ కుమారి వెంటనే పాఠశాలకు సంబంధించిన ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేశారు. పాఠశాలలో ఉన్న మిగతా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కాగా గతంలో ఓ చిన్న పిల్ల కశ్మీర్‌లోని తమ ఇంటి ముందు ఉన్న రహదారుల పరిస్థితిపై ఇలానే జర్నలిస్ట్‌గా మారి వివరంగా చెప్పింది. ఆ వీడియో కూడా అప్పట్లో వైరల్ అయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com