కావలసిన పదార్దాలు : మష్రూమ్స్ (పుట్టగొడుగులు), ఉల్లిపాయలు - 3, పచ్చిమిర్చి-4, అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్, ధనియాల పొడి - అర స్పూన్, జీలకర్ర పొడి - అర స్పూన్, కారం - 1 స్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, పసుపు - చిటికెడు, నూనె - తగినంత, కరివేపాకు, కొత్తిమీర తరుగు.
తయారీవిధానం:
-- పుట్టగొడుగులను మట్టి లేకుండా నీటితో శుభ్రంగా కడగాలి. ఒకటికి రెండు సార్లు కడిగితే కానీ, వీటికున్న మట్టి త్వరగా పోదు. సరిగా శుభ్రం చేయకుంటే, తినేటప్పుడు పంటికి ఇసక తగులుతుంది.
-- శుభ్రం చేసిన పుట్టగొడుగులను మీకు నచ్చిన విధంలో కట్ చేసి, గిన్నెలోకి తీసుకుని, ముక్క మునిగేంతవరకు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాలి. అందులో చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసి, రెండు పొంగులు వచ్చేంతవరకు ఉడికించి, ఆపై నీళ్ళనుండి, పుట్టగొడుగులను వేరు చెయ్యాలి.
-- ఇప్పుడు ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని బారుముక్కలుగా కోసుకోవాలి.
-- స్టవ్ ఆన్ చేసి, కళాయి పెట్టి సరిపడా నూనె వేసి, కాగనివ్వాలి.
-- నూనె వేడెక్కాక అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేపుకోవాలి.
-- ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపాలి. ఐదు నిమిషాల తర్వాత అందులో ఉడికించి పెట్టుకున్న పుట్టగొడుగులను వేసి బాగా కలపాలి.
-- ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలుపుతూనే ఉండాలి. లేకపోతే అడుగంటుతుంది.
-- ఈ మసాలా అంతా పుట్టగొడుగులకు పట్టిన తర్వాత అందులో కాస్తంత కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసెయ్యండి. అంతే.... టేస్టీ మష్రూమ్స్ ఫ్రై రెడీ.