ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మ ఒడికి భారీ కోత...కొత్త నిబంధనలు తెరపైకి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 23, 2022, 02:58 PM

అమ్మబడికి కొత్త నిబంధనలు అమలువుతున్నాయి. దీంతో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన అమ్మఒడి పథకానికి జగన్ సర్కారు మరిన్ని కోతలు విధిస్తోంది. అమ్మఒడి పథకం మూడో విడత సాయంలో ఏకంగా 1.29 లక్షల మంది తల్లులకు ప్రభుత్వం కోత పెట్టనున్నట్లు తెలుస్తోంది. అమ్మఒడి పథకం మూడో విడత సాయాన్ని ప్రభుత్వం ఈ నెల 27న తల్లుల ఖాతాల్లో జమ చేయనుంది. 2020, 2021లో విద్యార్థులకు 75% హాజరు నిబంధనను అమలు చేయలేదు. దీంతో మొదటి ఏడాది 43 లక్షలు, రెండో ఏడాది 44.48 లక్షల మందికి సాయాన్ని అందించారు. అయితే మూడో విడత సాయానికి మాత్రం ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టడంతో చాలామందికి ప్రయోజనాలు అందని పరిస్థితి నెలకొంది. ఆగస్టు 16 నుంచి పాఠశాలలు తెరిచినా కరోనా మూడోదశ రావడంతో చాలా ప్రాంతాల్లో తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపలేదు. దీంతో చాలామందికి 75% హాజరు పడలేదు. వారంతా మూడో ఏడాది అమ్మఒడి ప్రయోజనం కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2021 జనవరి 11న 44,48,865 మంది బ్యాంకు ఖాతాల్లో సాయాన్ని జమ చేయగా.. ఈ ఏడాది 43,19,090 మందిని అర్హులుగా తేల్చింది. వీరిలో 1,46,572 మందికి ఈ-కేవైసీ పూర్తికాలేదు. మరోవైపు కరెంట్ వాడకం నెలకు 300 యూనిట్లు దాటినా.. విద్యార్థికి 75% హాజరు లేకపోయినా అమ్మ ఒడికి అర్హత కోల్పోతారని ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కొత్త బియ్యం కార్డు ఉండడం, బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ లింకు చేసుకోవడం లాంటివి పూర్తి చేయకపోయినా అమ్మఒడికి అర్హత కోల్పోతారని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.


ఈ ఏడాది అమ్మఒడి పథకం అమలు బాధ్యతను పాఠశాల విద్యాశాఖ నుంచి తప్పించి గ్రామ, వార్డు సచివాలయ విభాగానికి అప్పగించారు. దీంతో ఇప్పటికే అర్హులను తేల్చిన అధికారులు ఆ జాబితాను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి పంపగా.. అనర్హుల జాబితాను మాత్రం ఇవ్వలేదు. దీంతో తమను ఎందుకు అనర్హులుగా ప్రకటించారో చెప్పాలంటూ చాలామంది సచివాలయ సిబ్బందిని నిలదీస్తున్నారు. తాజా అమ్మఒడి సాయంలో అందరికీ రూ.2వేలు కోత పడనుంది. 2020లో మరుగుదొడ్ల నిర్వహణకు స్వచ్ఛందంగా రూ.వెయ్యి ఇవ్వాలని తల్లిదండ్రులను అధికారులు కోరగా.. కొందరు రూ.వెయ్యి ఇవ్వగా.. మరికొందరు నిరాకరించారు. దీంతో 2021లో ఖాతాలకు జమ చేసే సమయంలోనే రూ.వెయ్యి మినహాయించారు. ఈ ఏడాది మరుగుదొడ్లు, పాఠశాల నిర్వహణ కోసమని రూ.2 వేలు మినహాయించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com