ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ తల దించుకునే పరిస్థితిని వైసీపీ తీసుకొచ్చింది: టీడీపీ నేతల విమర్శ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 11:38 PM

తెలుగోడు తల ఎత్తుకునే పరిస్థితిని ఎన్టీఆర్ తీసుకొస్తే ఏపీ తల దించుకునే పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని టీడీపీ నేతలు విమర్శించారు. మహానాడుకు ప్రైవేట్ వాహనాలు ఇచ్చిన వారిని బెదిరిస్తారా అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు... నడిరోడ్డు మీద జగన్ మీటింగులు పెట్టినా అనుమతించామని ఏ రోజూ అడ్డుకోలేదని చెప్పారు. వైసీపీ జోలికి తాము ఎప్పుడూ వెళ్లలేదని అన్నారు. అరచేతిని అడ్డం పెట్టి టీడీపీని ఆపలేరని మహానాడు విజయవంతం కావడాన్ని అడ్డుకోలేరని చెప్పారు.


టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దామచర్ల జనార్దన్ ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఒంగోలులో తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. మరోవైపు, టీడీపీ తోరణాలను కార్పొరేషన్ అధికారులు తొలగించారంటూ ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. 


'మా పార్టీ కార్యక్రమం కోసం మేము తోరణాలు కడుతూ పోతుంటే... మీరు విప్పుకుంటూ పోతారా?' అని సోమిరెడ్డి మండిపడ్డారు. వేడుక నిర్వహించడానికి తాము స్టేడియంకు ఇప్పటికే డబ్బు కట్టామని అలాంటప్పుడు అనుమతి ఎందుకివ్వరని ప్రశ్నించారు. కలెక్టర్లు, ఎస్పీలు ఎందుకున్నట్టని అడిగారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేనే లేదని అన్నారు.


రాత్రంతా తాము తోరణాలు కడితే... కార్పొరేషన్ వాళ్లు ఉదయం వచ్చి తొలగించారని దామచర్ల జనార్దన్ మండిపడ్డారు. దీని గురించి కమిషనర్ ను అడిగితే కలెక్టర్ ను అడగాలని చెప్పారని అన్నారు. మహానాడు కోసం వారం క్రితమే తాము దరఖాస్తు చేశామని.. అయినా ఇలాంటి చర్యలకు పాల్పడటం దారుణమని చెప్పారు. జగన్ పాదయాత్ర చేపట్టినప్పుడు తాము ఆటంకాలు కలిగించామా? అని ప్రశ్నించారు. మరోవైపు, ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు కార్యక్రమం జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com