ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్పీ మద్దతుతో రాజ్యసభ బరిలోకి కపిల్ సిబాబ్...కాంగ్రెస్ కు షాక్

national |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 11:33 PM

ఒక్కోక్కరుగా కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతలు దూరం కావడంతో ఆ పార్టీ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటోంది. తాజాగా  కాంగ్రెస్ పార్టీకి అత్యంత సీనియర్ నేత, మాజీ మంత్రి కపిల్ సిబల్ రాజీనామా సమర్పించారు. ఎవరూ ఊహించని చర్యతో షాకిచ్చారు. సమాజ్ వాదీ పార్టీ (ఎప్పీ) మద్దతుతో రాజ్యసభకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో సిబల్ వెంట ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తో పాటు ఆ పార్టీ నేతలు కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని సంస్కరించాలని డిమాండ్ చేస్తూ, పార్టీకి దూరంగా ఉంటున్న జీ23 (గ్రూపు 23) నేతల్లో కపిల్ సిబల్ కూడా ఒకరు. 


‘‘స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు వెళ్లాలని అనుకుంటున్నాను. దయచేసి సహకారం అందించండి.. అంటూ అఖిలేశ్ జీని కోరాను. 30 ఏళ్ల తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా పనిచేయాల్సిన అవసరం వచ్చింది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నేను ఇప్పుడు ఏమీ మాట్లాడను. విపక్షాల్లో చాలా వాటితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ తో అనుబంధం ఉందని నా భార్య చెప్పింది’’ అని కపిల్ సిబల్ పేర్కొన్నారు. 


‘‘నేడు కపిల్ సిబల్ నామినేషన్ వేశారు. ఎస్పీ మద్దతుతో రాజ్యసభకు వెళుతున్నారు. మరో ఇద్దరు కూడా ఎస్పీ నుంచి రాజ్యసభలో అడుగు పెడుతున్నారు. కపిల్ సిబల్ సీనియర్ న్యాయవాది. ఆయన తన అభిప్రాయాలను పార్లమెంటులో చాలా చక్కగా వినిపిస్తారు. ఆయన సొంత అభిప్రాయాలతో పాటు, ఎస్పీ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తారని భావిస్తున్నాను’’ అంటూ అఖిలేశ్ యాదవ్ అన్నారు.


‘‘మేము కూటమి ఏర్పాటు చేసి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయాలి. బీజేపీని వ్యతిరేకించే వాతావరణం ఏర్పాటు చేయాలి. ఆ దిశగా నేను పనిచేస్తాను’’ అని సిబల్ ప్రకటించారు. యూపీ నుంచి 11 రాజ్యసభ స్థానాలకు ఈ విడత ఎన్నికలు జరుగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com