ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇలాగైతే కష్టమే...మేం మూసేస్తాం...ప్రైవేటు పెట్రోల్ బంకు యాజమాన్యం అల్టీమేట్టం

national |  Suryaa Desk  | Published : Tue, May 24, 2022, 07:14 PM

రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నప్పటికీ.. దేశీయంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. నవంబర్ 2021 ప్రారంభం నుంచి 137 రోజుల పాటు పెట్రోల్, డీజీల్ ధరలను ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు పెంచలేదు. ఇన్ని రోజుల పాటు ధరలను పెంచకుండా స్థిరంగా ఉంచడం ఇదే తొలిసారి. ఆ తర్వాత మళ్లీ గత నెల కాలంగా 47 రోజుల పాటు ధరలను కంపెనీలు మార్చలేదు. దీంతో ప్రైవేట్ కంపెనీలు భారీగా నష్టాలను ఎదుర్కొన్నాయి.  పెరుగుతోన్న ఇంధన ధరల విషయంపై రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్(ఆర్‌బీఎంఎల్) పెట్రోలియం మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 


ఇదిలావుంటే ఆయిల్ మార్కెట్ అంతా ప్రభుత్వ రంగ కంపెనీల చేతిలో ఉండటంతో.. ప్రైవేట్ కంపెనీలు లబోదిబోమంటున్నాయి. ఒకవైపు క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నా.. ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచకుండా స్థిరంగా ఉంచుతుండటంతో తాము భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు వాపోతున్నాయి. ఇలాగైతే తాము భారత్‌లో పెట్రోల్‌ను అమ్మడం తమ వల్ల కాదని ప్రైవేట్ కంపెనీలు చేతులెత్తేశాయి. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సూపర్‌మేజర్ బీపీల జాయింట్ వెంచర్ ఆర్‌బీఎంఎల్ ప్రభుత్వానికి తమ నష్టాల గురించి వివరించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. పెట్రోల్, డీజిల్‌పై ఖర్చులు అత్యధికమవుతూ.. ధరలు స్థిరంగా ఉంటుంటడంతో ప్రతి నెలా ఆర్‌బీఎంఎల్ రూ.700 కోట్ల నష్టాన్ని చవి చూసినట్టు తెలిసింది. దీంతో ఈ కంపెనీ తన నష్టాలను తగ్గించుకునేందుకు తన రిటైల్ వ్యాపారాలను మూసివేసింది. రష్యా రోజ్‌నెఫ్ట్‌కు చెందిన నయారా ఎనర్జీ అయితే ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీల రేట్లకు అదనంగా లీటరుపై రూ.3 ఎక్కువకు పెట్రోల్, డీజిల్‌ను విక్రయిస్తోంది. ప్రభుత్వ రంగ కంపెనీల ధరల కంటే కాస్త ఎక్కువగా తమ ధరలను నిర్ణయించి.. నష్టాలను కాస్త మేర తగ్గించుకుంటోంది.


ఇదిలావుంటే రెండు రోజుల క్రితమే ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై రూ.8, లీటరు డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. ఈ తగ్గింపును వినియోగదారులకు కూడా బదిలీ చేసింది. అయితే 90 శాతం మార్కెట్ షేరు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల చేతిలోనే ఉందని, ఈ ధరలను నిర్ణయించడంలో కనీసం ప్రైవేట్ ఫ్యూయల్ రిటైలర్లకు అవకాశమే లేదని ఆర్‌బీఎంఎల్ వాపోతున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా ప్రభుత్వ కంపెనీలు రేట్లను పెంచడం లేదని, దీంతో తాము భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంటున్నాయి. 2022 మే 16 నాటికి తాము లీటరు పెట్రోల్‌పై రూ.13.08ను, లీటరు డీజిల్‌పై రూ.24.09ను నష్టపోయినట్టు ఈ ప్రైవేట్ కంపెనీలు తెలిపాయి.


అయితే పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు నిర్ణయిస్తాయని, కేవలం అంతర్జాతీయ ఆయిల్ ధరలను మాత్రమే కాక, ఇతర వ్యాపారాలు పెట్రోకెమికల్స్, రిఫైనింగ్ నుంచి వచ్చే లాభాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ రేట్లను నిర్ణయిస్తాయని ఉన్నతాధికారి చెప్పారు. ఇదిలావుంటే ఆర్‌బీఎంఎల్‌కు దేశంలో 1,459 పెట్రోల్ పంపులుండగా... నయారా ఎనర్జీకి 6,568 బంకులున్నాయి. దేశంలో ఉన్న మొత్తం 83,027 బంకులలో 74,647 బంకులను ప్రభుత్వ రంగ కంపెనీలు బీపీసీఎల్, ఐఓసీ, హెచ్‌పీఎల్‌లు నిర్వహిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com