ఆన్లైన్ లోన్ యాప్ల ఆగడాలు శృతి మించుతున్నాయి. కొందరు లోన్ రికవరీ ఏజెంట్లు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారి తీస్తోంది. కొన్ని సందర్భాల్లో పురుషులు సైతం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకొన్ని సందర్భాలలో మహిళలను సైతం వేధింపులకు గురి చేస్తున్నారు. వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి, బాధిత మహిళ సన్నిహితులు, బంధువులకు పంపుతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా జరిగింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ముంబైలోని విక్రోలి ప్రాంతానికి ఓ మహిళ(28) ఇటీవల ఆన్లైన్ లోన్ యాప్లో కొంత మొత్తం రుణం తీసుకుంది. దాదాపు అన్ని ఈఎంఐలు చెల్లించింది. చివరి ఈఎంఐ రూ.2,200 రికవరీకి మరో వారం రోజులు వ్యవధి ఉన్నప్పటికీ ఫోన్లో రికవరీ ఏజెంట్లు ఇబ్బందులు పెట్టసాగారు. తాను గడువులోగా చెల్లిస్తానని ఆ మహిళ బదులిచ్చింది. అయితే మరో మూడు రోజుల గడువు ఉండగానే లోన్ రికవరీ ఏజెంట్లు దారుణానికి పాల్పడ్డారు. ఆ మహిళ ఫొటోలను మార్ఫింగ్ చేసి, ఆమె సన్నిహితులు, బంధువులకు పంపించారు. అవి ఎంతో అసభ్యకరంగా ఉన్నాయని బంధువుల నుంచి ఆమెకు ఫోన్లు వచ్చాయి. వారికి వెళ్లిన తన మార్ఫింగ్ ఫొటోలు చూడగానే బాధిత మహిళ క్రుంగిపోయింది. చివరికి పోలీసులను ఆశ్రయించి, లోన్ రికవరీ ఏజెంట్లపై కేసు పెట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు అధికంగా జరుగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.