ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అపరిచిత కాల్స్ తో అప్రమత్తంగా ఉండండి...లేకపోతే మీ అకౌంట్ ఖాళీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 22, 2022, 07:09 PM

సైబర్ నేరాల పట్ల పోలీసులు ఎంతగా చైతన్యం తీసుకొస్తున్న ప్రజల్లో ఇంకా మార్పు రావడంలేదు. మోసగాళ్ల వలకు చిక్కి మోసపోతూనే ఉన్నారు. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఆధార్ కార్డ్ వివరాలు ఇలా ఎవరికి ఇవ్వద్దని పోలీసులు అనేక సందర్భాలలో చెబుతూనే ఉన్నారు. అయినా పరిహారం పేరు వినగానే ప్రజలు అందులో ఎంతవాస్తవం అన్నది తెలుసుకోకుండానే మోసగాళ్ల వలకు చిక్కుతున్నారు. 


తాజాగా అనకాపల్లి జిల్లాలో కరోనా పరిహారం పేరుతో ఓ అమాయకుడు నిండా మునిగాడు. ప్రభుత్వం నుంచి కరోనా పరిహారం మంజూరైందని.. బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఫోన్‌ పే నంబరు ఇవ్వాలని అడిగారు. ఆన్‌లైన్‌లో డబ్బులు పంపిస్తామని చెప్పడంతో నిజమని నమ్మి ..అతడికి వివరాలు చెప్పిన ఇద్దరి అకౌంట్‌ల నుంచి క్షణాల్లో రూ.90వేలు కాజేశాడు.


అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం సాగరం సచివాలయం ఏఎన్‌ఎం కొండమ్మకు గురువారం ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ‘మీ పరిధిలో ఎంతమంది కరోనాతో చనిపోయారు?.. వారి పేరు, చనిపోయిన తేదీ, ఫోన్‌ నంబరు అడిగాడు. అందుకు కొంత సమయం కావాలని చెప్పగా.. ఫోన్ చేసిన వ్యక్తి కలెక్టరేట్‌ నుంచి ఫోన్‌ చేస్తే నిర్లక్ష్యంగా ఉంటారా అని మండిపడ్డాడు. వెంటనే ఆమె కరోనాతో చనిపోయిన కొందరి వివరాలను అతడికి ఇచ్చింది. ఆ జాబితాలో వాడపాడుకు చెందిన యన్నంశెట్టి రాజుబాబు, డి.గొటివాడకు చెందిన గెమ్మిలి జగన్నాథరావులు ఉన్నారు.


కొద్దిసేపటికి యన్నంశెట్టి రాజుబాబు కుమారుడు ప్రసాద్‌కు అదే వ్యక్తి నుంచి ఫోన్‌ వెళ్లింది. ‘కలెక్టర్‌ ఆఫీస్‌ నుంచి మాట్లాడుతున్నాను. మీ నాన్న రాజుబాబు కరోనాతో చనిపోయారు కదా.. ఆయనకు రూ.50 వేల నష్టపరిహారం వచ్చింది. ఆ డబ్బులు మీ బ్యాంకు అకౌంట్‌లో జమ చేయాలంటే అకౌంట్‌లో కనీసం రూ.10 వేలు బ్యాలెన్స్‌ ఉండాలి’ అని చెప్పాడు. ప్రసాద్‌ తన అకౌంట్‌లో రూ.7 వేలు ఉన్నాయని.. మిగిలిన రూ.3 వేలు వేస్తానని బదులిచ్చాడు. అలా కుదరదని వేరే ఎవరిదైనా బ్యాంకు అకౌంట్‌ నంబరు ఇవ్వాలని.. అందులో జమ చేస్తానని చెప్పడంతో నిజమని నమ్మాడు.


ప్రసాద్‌ తన బావ బ్యాంకు అకౌంట్ వివరాలతో పాటు ఫోన్‌పే నంబర్‌ కూడా ఇచ్చాడు. తర్వాత మరికొంత సమాచారం అడిగి తీసుకున్నాడు. అంతే ప్రసాద్‌ బావ అకౌంట్‌ నుంచి పది నిమిషాల్లో రూ.50 వేలు, తర్వాత రూ.20 వేలు మొత్తం రూ.70 వేలు డ్రా చేసినట్టు మొబైల్‌లకు మెసేజ్‌ వచ్చింది. వెంటనే ప్రసాద్ అప్రమత్తం అయ్యాడు.. జరిగిన విషయాన్ని ఏఎన్‌ఎం కొండమ్మకు చెప్పాడు.


మళ్లీ డి.గొటివాడకు చెందిన అరుణకుమారి అనే మహిళకు ఫోన్‌ చేసి.. ‘మీ భర్త జగన్నాథరావు కరోనాతో చనిపోయినందున ప్రభుత్వం నుంచి పరిహారం మంజూరైందని చెప్పాడు. యన్నంశెట్టి ప్రసాద్‌కు చెప్పినట్టే బ్యాంకు ఖాతాలో కనీసం రూ.10 వేలు ఉండాలని’ ఆమెకు కూడా చెప్పాడు. ఆమె కూడా తన అకౌంట్‌లో డబ్బులు లేకపోవడంతో తెలిసిన ఇద్దరి వ్యక్తుల బ్యాంకు అకౌంట్ వివరాలు, ఫోన్‌ పే నంబరు ఇచ్చింది.


కొద్దిసేపటి తర్వాత ఆ ఇద్దరి అకౌంట్‌ల నుంచి రూ.10 వేల చొప్పున డ్రా చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అరుణకుమారి.. సచివాలయ ఏఎన్‌ఎం కొండమ్మను ప్రశ్నించింది. దీంతో కరోనా పరిహారం పేరుతో మోసపోయామని గుర్తించి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలా అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఇలా వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని హెచ్చరించారు. గతంలో కూడా ఇలాగే కరోనా పరిహారం పేరుతో చాలా మోసాలు జరిగాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com