వేసవిలో రాగి జావ అందరూ సాధారణంగా తాగుతారు. అయితే, రాగి జావకు ఖర్జురాన్ని కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కాల్షియం అందుతుంది. పిల్లలు, పెద్దలు, అందరూ తాగాల్సిన పానీయం ఇది. వేసవిలో కాఫీ, టీ లకు బదులు రాగి ఖర్జూర జావ ను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి ఈ రెసిపీ ని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా...
కావలసిన పదార్థాలు: రాగి పిండి - ఒక కప్పు, యాలకుల పొడి - 1 స్పూన్, పాలు - అరలీటరు, ఖర్జూరం - 4 లేదా 5, బాదం, జీడిపప్పు - కొద్దిగా.
తయారీవిధానం: ముందుగా ఒక గిన్నెలో ఒక చిన్న గ్లాసు పాలు పోసుకొని బాగా వేడి చెయ్యాలి. ఖర్జూరాన్ని గింజలు తీసేసి కాగుతున్న పాలలో వెయ్యాలి. పాలు ఇగిరిపోయి, ఖర్జూరం మెత్తగా అయ్యేంత వరకు మరిగించాలి. అలా ఐన తర్వాత మిక్సీ జార్లోకి ఈ మిశ్రమాన్ని తీసుకుని కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు రాగిపిండిని తీసుకుని కొంచెం నీటిని పోసి మెత్తగా, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడొక మందపాటి గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని ఒక పావులీటరు నీటిని తీసుకుని బాగా వేడిచెయ్యాలి. నీళ్లు మరుగుతున్న క్రమంలో ఇందాక కలిపి పెట్టుకున్న రాగిపిండిని అందులో వేసుకోవాలి. ఈ క్రమంలో నీళ్లను గరిటెతో తిప్పుతూ రాగిపిండిని కలుపుకుంటే, ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు సిమ్ లో పెట్టుకుని, ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్టును, మిగిలిన పాలు, కొద్దిగా యాలకుల పొడి వేసి 5 నిముషాలు ఉడికించుకోవాలి. మీకు అందుబాటులో ఉంటే ఖర్జూరం, అంజూరా ను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఇందులో వేసుకుంటే, చాలా రుచిగా ఉంటుంది, పైగా ఆరోగ్యం కూడానూ.