పసందైన భోజనానికి మంచి ముగింపును చెప్పాలంటే, పెరుగును వాడాల్సిందే. భోజనం చివరిలో పెరుగు వేసుకోకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. కొంతమందికి కడుపు నిండిన భావన రాదు. మరికొంతమందైతే ఏ కూరలు వేసుకోకుండా భోజనం మొత్తాన్ని పెరుగుతోనే చేసేస్తుంటారు. అలానే మరికొంతమందికి అసలు పెరుగు వాసనే పడదు. గడ్డ పెరుగును తినాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే దానికి ఒక చక్కటి మార్గం ఉంది అదేంటో తెలుసుకుందామా...
ముందుగా ఒక లీటర్ చిక్కటి పాలను తీసుకోవాలి. అవి మరిగించే ముందు ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకుని ఒక స్పూన్ పాలతో బాగా మెత్తని మిశ్రమంలా కలుపుకోవాలి. దీనిని పాలలో వేసి బాగా మరిగించండి. అయితే పాలు పొంగు వచ్చేంతవరకు స్పూన్ పెట్టి కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మనం ఇందులో కార్న్ కలిపాం కాబట్టి. ఓకేనా. ఆ తర్వాత ఇంకేముంది అంతా మాములే. పాలను చల్లార్చి, గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక స్పూన్ పెరుగును వేసి తోడుపెట్టాలి. ఈ గిన్నెను కదిలించకుండా వంటగదిలో ఒక పక్కకు పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ ను రాత్రిపూట చేస్తే మంచిది. తెల్లారి లేచిచూడండి. రాయి కన్నా గట్టిగా ఉండే గడ్డ పెరుగు తయారై ఉంటుంది. దీనిని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మధ్యాహ్నం భోజనంలో వేసుకుని ఆరగించండి.