మహిళలను వేధింపుల నుంచి రక్షించాల్సిన పోలీస్ కానిస్టేబులే ఓ మైనర్ బాలికను వేధింపులకు గురి చేయడంతో సస్పెండ్ అయ్యాడు. ఈ ఘటన రాజస్ధాన్లోని అజ్మీర్లో చోటు చేసుకుంది. పిసాంగన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న నిందితుడు విక్రమ్ సింగ్పై ఐటీ, పోక్సో చట్టాల సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్నినెలలుగా మైనర్ బాలికను వేధింపులకు గురిచేస్తున్నాడని పిసంగన్ పంచాయత్ సమితి సభ్యుడైన ప్రదీప్ కుమావత్ కానిస్టేబుల్ సింగ్పై ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై అజ్మీర్ పోలీసు సూపరింటెండెంట్ జగదీష్ చంద్ర శర్మ మాట్లాడుతూ.. విక్రమ్ సింగ్ మైనర్ బాలికను వేధిస్తున్నట్లు ఫిర్యాదు అందగానే అతన్ని సస్పెండ్ చేశాము. నసీరాబాద్ సదర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారని, విచారణ పూర్తయిన తర్వాత కానిస్టేబుల్ని అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు.