పశ్చిమబెంగాల్లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ కు ముచ్చెమటలు పట్టించిన బీజేపీకి ప్రజలు మాత్రం బ్రహ్మరధం పట్టలేదు. దీంతో అసలే ఓటమి బాధలో ఉన్న బీజేపీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలు వరుస షాకులు ఇవ్వడం మొదలుపెట్టేశారు. ముఖ్యంగా గతంలో టీఎంసీ నుంచి బీజేపీలో చేరి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం తిరిగి తృణమూల్ కు వెళ్లిపోవడం మొదలుపెట్టేశారు. దీంతో రంగంలోకి దిగిన బీజేపీ హైకమాండ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చేసింది.
దిలీప్ ఘోష్ స్థానంలో బిజెపి పశ్చిమ బెంగాల్ యూనిట్ అధ్యక్షుడిగా నియమితుడైన బాలూర్ఘాట్ ఎమ్మెల్యే సుకంత మజుందార్ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన నియామకంతో పాటు టీఎంసీలోకి ఫిరాయిస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలపైనా సుకాంత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఒక సాధారణ పార్టీ కార్యకర్తకు ఇంత పెద్ద బాధ్యతను" ఇచ్చినందుకు కేంద్ర నాయకత్వానికి సుకాంత కృతజ్ఞతలు తెలిపారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తరువాత, అనేక మంది సీనియర్ నాయకులు రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ కు ఫిరాయించిన కొన్ని నెలల తర్వాత సుకంత మజుందార్ నియామకం జరిగింది. దీనిపై స్పందించిన ఆయన.. సాధారణ కార్యకర్తకు పార్టీ ఇంత పెద్ద బాధ్యతను ఇచ్చింది. ఇది బిజెపిలో మాత్రమే సాధ్యమవుతుంది. మరే ఇతర రాజకీయ పార్టీలు అలాంటి నిర్ణయాలు తీసుకోలేవన్నారు.. నేను హైకమాండ్ అంచనాలను అందుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పారు.
తనను అధ్యక్షుడిగా ప్రకటించిన కొద్దిసేపటికే దీనిపై స్పందించిన సుకాంత మజుందార్ బిజెపి ఒక పెద్ద కుటుంబం, అందులో సభ్యుల మధ్య కొన్ని విభేదాలు ఉండవచ్చొన్నారు. సైద్ధాంతిక కారణాల వల్ల బిజెపిలో ఉన్నవారు వదలరని నాకు నమ్మకం ఉంది. నిర్లక్ష్యానికి గురైన మా కార్మికులకు నేను క్షమాపణలు కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. భావజాలంలో తేడాలు లేవు. అభిప్రాయాలలోని విభేదాలను పరిష్కరించవచ్చుకోవచ్చని ఫిరాయింపు దారులకు ఆయన చెప్పారు. ఇందుకోసం ఈ నెల 26న ఢిల్లీ వెళ్తున్నట్లు ఆయన వెల్లడించారు. బిజెపిని వదిలే వారు ఏవో ఉద్దేశాలతో పార్టీలో చేరారని, అవి నెరవేరకపోవడంతోనే పార్టీని వీడుతున్నట్లు సుకాంత తెలిపారు. బిజెపి సిద్ధాంతంపై నమ్మకం ఉన్న వ్యక్తులు ఎప్పటికీ వదలరని ఆయన పేర్కొన్నారు.