కరోనా వైరస్ ఏరోసాల్స్ (గాలి తుంపర), డ్రాప్లెట్స్(సూక్ష్మ బిందువులు) ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. సదరు రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వైరస్ దగ్గరలో ఉన్నవారికి, పక్కనే ఉండేవారికి సోకుతుంది. పక్కన ఎవరూ ఆ సమయంలో లేకుంటే క్రమంగా బయటి వాతావరణంలో కరోనా వైరస్ నిర్వీర్యం అవుతుంది. కానీ జలుబు లాంటి వైరస్లు గాలి ద్వారా కూడా వ్యాపిస్తాయి. వీటి ఏరోసాల్స్ ఎక్కువ దూరం పయనిస్తాయి, ఎక్కువకాలం గాల్లో ఉంటాయి. అందుకే ఒక సమూహంలో ఒకరికి జలుబు చేసినా ఇతరులందరికీ తొందరగా అంటుకునే అవకాశాలు ఎక్కువ. కరోనా వైరస్ ప్రస్తుతం ఈ శక్తిని సాధించే యత్నాల్లో ఉంది. కరోనా వేరియంట్లు గాల్లో ప్రయాణించడంలో మెలకువలు సాధిస్తున్నాయని, దీనివల్ల కరోనా గాలి ద్వారా వ్యాపించే అవకాశాలు పెరుగుతాయని మేరీల్యాండ్ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు మరింత టైట్ ఫిట్ మాస్కులు ధరించడం, నివాస గృహాల్లో విస్తృత వెంటిలేషన్ ఏర్పరుచుకోవడం చేయాలని సూచించింది.
అప్పుడే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని తెలిపింది. ఇప్పటికే కరోనా సోకిన వారు వదిలే గాలిలో వైరస్ ఉంటుంది. అల్ఫా వేరియంట్ సోకిన వారు వదిలే గాలిలో 43–100 రెట్లు అధిక వైరస్లోడు ఉంటుందని అధ్యయనాలు వివరిస్తున్నాయి. ఇప్పటివరకు ఇవి బయట గాలిలో ఎక్కువ దూరం ప్రయాణించి ఇతరులకు సోకడం జరగలేదు. అయితే క్రమంగా వాయు ప్రయాణం చేసే శక్తిని వేరియంట్లు పెంచుకుంటున్నాయని, దీనివల్ల వైరల్ ఏరోసాల్స్ పెరిగిపోతున్నాయని సీఐడీ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం తెలిపింది. మాస్కుల వల్ల వైరస్సోకే అవకాశాలు దాదాపు 50 శాతం తగ్గుతాయని వివరించారు. కానీ లూజుగా ఉండే దుస్తులు, సర్జికల్ మాస్కుల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని తెలిపారు.