ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో మాత్రమే అధికారంలో ఉన్న ఆమాద్మీ పార్టీ ఇతర రాష్ట్రాల్లోనూ సత్తాచాటాలని భావిస్తోంది. పార్టీని దేశమంతటా విస్తరించేందుకు ఆమాద్మీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం కోసం పక్కాగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అంతేకాదు సంచలన హామీలతో ఇప్పటి నుంచే ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. ఆదివారం ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీ రోడ్ షో నిర్వహించిన అరవింద్ కేజ్రీవాల్ అనేక హామీలను ప్రకటించారు. ఉత్తరాఖండ్లో ఆమాద్మీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోనే లక్ష ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు నిరుద్యోగులకు ప్రతి నెల రూ.5వేలు భృతి ఇస్తామని సంచలన ప్రకటన చేశారు.