రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీగంగానగర్ జిల్లాలో బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో నలుగురు సజీవ దహనమవ్వగా.. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అనుప్గఢ్-బికనీర్ రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రయాణికుల బస్సు శ్రీగంగానగర్ నుంచి మోహన్ గఢ్ వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ను ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే కొందరు ప్రయాణికులు బస్సు నుంచి కిందికి దూకగా.. మరికొందరు మంటల్లో చిక్కుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. బస్సులో ముగ్గురు మరణించగా.. ట్రక్కు డ్రైవర్ కూడా చనిపోయినట్టు పోలీసులు తెలిపారు.