అనంతపురం: ఓబుళదేవునిచెరువు మండలంలోని గాజుకుంటపల్లిలో కాపురముంటున్న అంగన్ వాడీ టీచర్ విమలమ్మ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. బాధితురాలి భర్త రఘునాధ్ తెలిపిన మేరకు.. తమ మనవడికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో శనివారం ఉదయం తనకల్లుకు వెళ్లారు. రాత్రి ఇంటికి వచ్చి చూడగా ఇంటి ప్రధాన ద్వారం గొళ్లెం పగులకొట్టి ఇంట్లో ఉన్న బీరువాలోని 18 తులాల బంగారం, రూ. 5 లక్ష లు నగదు ఎత్తుకెళ్లారని బోరున విలపించారు. ఐదు రోజుల కిందట గౌరీ బిదనూరులో తమ అన్న ఇల్లు అమ్మడంతో వచ్చిన రూ. 5 లక్షలు, అతడి కుమారుడు చలపతి తన వద్ద భద్రపరచమని ఇచ్చాడని, ఆ డబ్బులు కూడా దోచుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశామని విమలమ్మ తెలిపారు.