ప్రజలందరి చల్లని దీవెనలతో పరిషత్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించామని ఏపీ సీఎం జగన్ అన్నారు. పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన సందర్భంగా సీఎం జగన్ సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు. ఈ ఫలితాలు ప్రతి కుటుంబం, ప్రతి మనిషి పట్ల తన బాధ్యతను మరింత పెంచాయని సీఎం జగన్ తెలిపారు. పరిషత్ ఎన్నికల విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. 81 శాతం పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులను ప్రజలు ఎన్నుకున్నారని, మున్సిపల్ ఎన్నికల్లోనూ 99 శాతం వైసీపీ అభ్యర్థులే గెలిచారని తెలిపారు.
86 శాతం ఎంపీటీలు, 98 శాతం జడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ నే గెలిపించారని సీఎం జగన్ తెలిపారు. ప్రతి ఎన్నికల్లో సడలని ఆప్యాయతను ప్రజలు అందిస్తున్నారని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కొన్ని శక్తులు ప్రయత్నించాయని, అన్యాయపు మీడియా సంస్థలు అబద్ధాన్ని నిజం చేయాలని చూశాయని అన్నారు.