ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓ యువతిని బ్లాక్ మెయిల్ చేసి రెండేళ్లుగా అత్యాచారం చేశాడు. తన కుమారుడితో కలిసి ఓ గదికి తీసుకెళ్లి వీడియో తీసి బెదిరించేందుకు ప్రయత్నించాడు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీస్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. అనంతరం గంగానదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన యూపీలోని కాన్పూర్లో చోటుచేసుకుంది. యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కానిస్టేబుల్, అతని కొడుకుపై కేసు నమోదుచేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్జాపుర్ జిల్లాకు చెందిన యువతి (25) జనవరి 2019లో జరిగిన అలహాబాద్ కుంభమేళాకు తన కుటుంబంతో కలిసి వచ్చింది. యువతి కుటుంబమంతా వారి బంధువైన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆ కానిస్టేబుల్ బాధిత తనను అలహాబాద్లోని ఓ హోటల్ కు తీసుకెళ్లాడని, కూల్ డ్రింక్ లో నిద్రమాత్రలు కలిపి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది. ఆ సమయంలో తీసిన వీడియోతో తనను బ్లాక్మెయిల్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది.
ఈ వీడియోను బయటపెడతానని బెదిరించి రెండేళ్లుగా అలహాబాద్, కాన్పూర్కు పలుసార్లు తీసుకొచ్చి అత్యాచారం చేశాడని వివరించింది. ఈ అదివారం కాన్పూర్ లోని చాకేరి ప్రాంతంలో ట్రాఫిక్ కానిస్టేబుల్, ఆయన కుమారుడు తనను ఓ గదికి తీసుకెళ్లారని చెప్పింది. అక్కడ వారిద్దరూ కలిసి మరోసారి వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేసింది. చివరికి వారి నుంచి తప్పించుకుని బయటపడినట్టు చెప్పింది.
పోలీసులకు సమాచారం ఇచ్చిన బాధిత యువతి గంగానదిలో దూకింది. పోలీసులు ఆమెను కాపాడి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశామని, ఇంకా అరెస్ట్ చేయలేదని కాన్పూర్ ఈస్ట్ డీసీపీ ప్రమోద్ కుమార్ తెలిపారు. పూర్తి వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు.