భారతీయ సంస్కృతికి మారుపేరుగా భక్తి విశ్వాసాలకు నిలయాలుగా ప్రజాదరణ పొంది ఒకనాడు దేదీప్యమానంగా వెలుగొందిన దేవాలయాలు దీనవాస్థకు చేరుకుంటున్నాయి. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఎంతో విలువైన ఆస్తిపాస్తులు ఉన్నా నిత్యపూజలకు నోచుకోక, కనీసం దీపం పెట్టే దిక్కులేక కళావిహీనంగా మిగిలిపోతున్నాయి.
రాజకీయ అవసరాల కోసం దేవుడిని, దేవాలయాలను, దైవభక్తిని దుర్వినియోగం చేసే దుష్ట సంప్రదాయం ఆరంభమైనప్పటి నుంచి దేవాలయ వ్యవస్థ పతనం మొదలైందని చెప్పొచ్చు. గతంలో ఎన్నో విదేశీ దాడులను ఎదుర్కొని మరెన్నో ఆటుపోట్లను తట్టుకున్న దేవుళ్లు ఇప్పుడు స్వజనుల దోపిడీలను నివారించలేకపోతున్నారు.
ఆస్తులను స్వాహా చేయడమేకాదు. హుండీలకు కన్నం పెడుతున్నారు. వందలాది సంవత్సరాల చరిత్ర గల అపురూప శిల్పకళాఖండాలు ఉన్న దేవాలయ ప్రాంగణాల్లో విగ్రహాలను పెకిలించుకుపోతున్నారు. గుప్తనిధుల కోసం మరొకపక్క నిరాంటకంగా తవ్వకాలు జరుగుతున్నాయి.
ఇంత జరుగుతున్నా దేవుళ్ల ఆస్తులను పరిరక్షించాల్సిన దేవాదాయశాఖ అవసరం మేరకు పట్టించుకోకపోవడం దురదృష్టకరం. దేవాలయ భూములు ఎన్ని? అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయి? వాటిపై రావాల్సిన ఆదాయం ఎంత? ఎంత వస్తున్నది? తదితర వివరాల విషయంలో స్పష్టత లేదు.
తాజాగా ఈ నెల మొదటివారంలో ఒక కేసు విషయంలో విచారణ చేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం దేవాలయాలకు దాతలు ఇచ్చిన భూములకు దేవుడే యజమాని అంటూ పూజారికి ఎలాంటి యాజమాన్యపు హక్కులుండవని స్పష్టమైన తీర్పు వెల్లడించింది.
ఆలయాల ఆస్తులను కొందరు పూజారులు అనధికారికంగా విక్రయించకుండా ఉండేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. ఆలయ భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డుల నుంచి పూజారి పేరు తొలగించాలని రెండు సర్క్యులర్లను మధ్యప్రదేశ్ ప్రభుత్వం జారీచేసింది.
దీనిపై కొందరు ఆ రాష్ట్ర హైకోర్టుకు వెళ్లగా, ఆ ఆదేశాలను కొట్టి వేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఎ.ఎన్ భోపన్నలతో కూడా ధర్మాసనం ఆలయ భూములకు దేవుడే యజమాని అని స్పష్టమైన తీర్పు ఇచ్చింది.
ఆలయ భూములకు సంబంధించి రికార్డుల్లో ఓనర్షిప్ కాలం వద్ద దేవుడి పేరు మాత్రం ఉండాలని, అలాగే అనుభవదారు కాలంలో దేవుడి పేరే ఉండాలంటూ తీర్పు చెప్పింది. చట్టప్రకారం దేవుడి ఆస్తులను పరిరక్షించే బాధ్యతను మాత్రమే అతను నిర్వహిస్తాడని, భూస్వామి కాలేడని ధర్మాసనం తీర్పులో పేర్కొన్నది.