పెళ్లి జరిగిన కొద్ది రోజులకే ఓ యువతిని తన భర్త, అత్తమామలు తనను హింసించడం మొదలు పెట్టారు. భర్త తనతో శృంగారం చేయడం లేదని, దాని గురించి ప్రశ్నిస్తే తనను దారుణంగా కొట్టారని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కట్నం తీసుకురావాలని వేధించినట్టుగా మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన గుజురాత్లోని అహ్మదాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 27న 25 ఏళ్ల వ్యక్తితో బాధిత మహిళ(23) కు వివాహం జరిగింది. పెళ్లి జరిగిన 10 రోజులకు ఆమె భర్త తనతో శృంగారంలో పాల్గొన్నాడని, ఆ తర్వాత మళ్లీ అతడు తనతో కలవలేదని బాధితురాలు చెప్పింది. శృంగారం గురించి ప్రస్తావిస్తే.. తనను చాలా దారుణంగా కొడుతున్నాడని చెప్పింది.
తన భర్త బెడ్రూమ్లో ఉన్నప్పుడు వింతగా ప్రవర్తించేవాడని, తనను బెడ్ రూమ్లో ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయేవాడని మహిళ తన ఫిర్యాదులో ఆరోపించింది. తన రూపం నచ్చలేదని తన భర్త తనతో చెప్పినట్టుగా మహిళ పేర్కొంది. అతడు మరో మహిళతో శారీరక సంబంధం కొనసాగిస్తున్నట్టుగా చెప్పింది. ఈ క్రమంలోనే కోపంతో ఆగస్టు 1న ఇల్లు వదిలేసి వెళ్లిపోయానని చెప్పింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు, అత్తింటివారు ఆమెను తిరిగి భర్త వద్దకు చేర్చారని, ఇకపై ఎలాంటి వేధింపులు ఉండవని అత్తింటివారు ఆమెకు హామీ ఇచ్చారని పేర్కొంది.
కానీ భర్త వద్దకు చేరిన ఆమెకు మళ్లీ అవే పరిస్థితులు ఎదురయ్యాయి. తనను హింసించడమే కాకుండా, పట్టించుకోవడం మానేశారు. ఆగస్టు 7వ తేదీన తన భర్త తనను తల్లిదండ్రుల ఇంట్లో వదిలేశాడని చెప్పింది. ఈ క్రమంలోనే పోలీసులను ఆశ్రయించినట్లు పేర్కొంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్తమామలపై గృహహింస కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది.