ఆంధ్రప్రదేశ్ లో కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్తే తననే కొట్టి వేధిస్తున్నారంటూ ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. నంద్యాలలో కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సలీంను స్ఫూర్తిగా తీసుకుని తాను కుటుంబంతో సూసైడ్ చేసుకుంటానని బాధితుడు పేర్కొన్నాడు. ఈ వీడియోను సీఎం జగన్ వద్దకు చేరేలా చూడాలని కోరారు. కడప జిల్లాకు చెందిన మైదుకూరుకు చెందిన అక్బర్ బాషా భూ కబ్జా విషయంలో న్యాయం కావాలని, న్యాయం జరగని పక్షంలో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దిక్కు లేదని సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. తకు 2009లో దాన విక్రయం కింద ఎకరమున్నర భూమి రిజిస్టర్ అయ్యిందని. దాని మీద కోర్టు కేసు నడుస్తోందని తెలిపారు. ఆ భూమిని లాక్కోవడానికి వైసీపీకి చెందిన తిరుపాల్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయంపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తే మైదుకూరు రూరల్ సీఐని కలిసి సమస్య పరిష్కరిస్తారని సూచించారని తెలిపారు. నిన్నటి వరకు న్యాయం చేస్తా అన్న సీఐ ఇప్పుడు వేరే వారికి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు.
తాను చెప్పినట్లు వినకపోతే ఎన్కౌంటర్ చేస్తామని సీఐ బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను కొట్టి తన భార్యను స్టేషన్ నుంచి బయటికి గెంటించేశారని కన్నీటిపర్యంతమయ్యారు. మమ్మల్ని చంపి మా భూములు లాక్కోండని వాపోయాడు. వారు ఎన్కౌంటర్ చేసే వరుకు బతికి ఉండమని మేమే ఆత్మహత్య చేసుకొంటామని అన్నారు. ఒక ఎమ్మెల్యే మద్దతుతో మండల నాయకుడు పోలీసులను కంట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు. తనకు మైదుకూరు రూరల్ సీఐ కొండారెడ్డి, స్థానిక వైసీపీ నాయకుడు తిరుపాల్ రెడ్డి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. తనకు 48 గంటల్లో న్యాయం చేయాలని లేని పక్షంలో తన కుటుంబం మొత్తం ప్రాణాలు తీసుకుంటుందని బాషా హెచ్చరించాడు. తనను చంపి తన పొలంలో పాతి పెడతామని బెదిరిస్తున్నారన్నారు. ఈ వీడియో సీఎం జగన్కు చేరేలా చూడాలన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.