ఒక వ్యక్తిని ప్రేమించినందుకు 25 ఏళ్లుగా ఒక మహిళను బంధీగా కట్టిపడేసింది ఆమె తల్లి. కూతురు ప్రేమను నిరాకరించిన ఆ ప్రబుద్దురాలు ప్రేమించిన పాపానికి ఆమెను పాతికేళ్లుగా చీకటి గదిలో బంధించింది. మానవ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన ఘటనల్లో ఒకటిగా మారిన ఈ కథ కన్నీరు తెప్పిస్తుంది. అయితే ఇది ఇప్పుడు జరిగిన విషయం కాదు. 19వ శతాబ్దంలో ఫ్రాన్స్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. 1876వ సంవత్సరంలో ఫ్రాన్స్లో బ్లాంచే మోనియర్ అనే యువతి ఓ వ్యక్తిని ప్రేమించింది. అప్పుడు ఆమెకు 25 సంవత్సరాలు. ప్రేమ విషయాన్ని తన తల్లి మేడమ్ మోనియర్కు చెప్పింది. అయితే బ్లాంచే ప్రేమించిన వ్యక్తి, ఆమె తల్లికి నచ్చలేదు. దీంతో కూతురి ప్రేమను ఆమె నిరాకరించింది. అంతేకాక, ఆమెను ధనవంతుడైన మరో వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది. కానీ ఈ పెళ్లికి బ్లాంచే నిరాకరించింది. తన ప్రేమికుడే కావాలని తేల్చి చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన మేడమ్ మోనియర్.. తన కుమారుడి సహాయంతో బ్లాంచేను చీకటి గదిలో బంధించింది. ఆమెను గొలుసులతో కట్టిపడేసింది. ఆ చిత్రహింసలు తట్టుకోలేక బ్లాంచే ఆర్తనాదాలు చేసేది. ఆ శబ్దాల గురించి ఇరుగుపొరుగు వారు మేడమ్ మోనియర్ను ఆరా తీయగా తన కూతురికి పిచ్చి పట్టిందని బదులు చెప్పేది.
బ్లాంచేకు 50 ఏళ్లు వచ్చేవరకు ఆ చీకటి గదిలోనే ఆమె నివసించింది. ఓ సేవకుడు ఆమె బెడ్ వద్దకు ఆహారాన్ని విసిరేసేవాడు. గొలుసులతో కట్టేయడం వల్ల బ్లాంచే పడుకున్న చోటే మల, మూత్ర విసర్జన చేయాల్సివచ్చింది. ఇలా ఎంతో దారుణమైన జీవితాన్ని ఆమె అనుభవించింది. ఫలితంగా ఆమె బరువు 55 పౌండ్లకు పడిపోయింది. చివరకు 1901 మే 23న పారిస్ అటార్నీ జనరల్కు ఓ రహస్య లేఖ అందింది. మేడమ్ మోనియర్ ఇంట్లో 25 ఏళ్లుగా ఒకరు బంధీగా ఉన్నారని అందులో ప్రస్తావించారు. అనంతరం పోలీసులు ఆమె ఇంటిపై దాడి చేసి బ్లాంచేను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. తల్లిని, సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ దారుణ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.