భారత్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ మళ్లీ పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో థర్డ్వేవ్ ప్రమాదం పొంచి ఉండటంతో జాగ్రత్తలు పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో నిన్న దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు నేడు పెరిగాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 37,875 కేసులు నమోదయ్యాయి. సోమవారంతో పోల్చుకుంటే.. మంగళవారం దాదాపు 5 వేలకు పైగా కేసులు పెరిగాయి. దీంతోపాటు.. మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగతూ వస్తోంది. నిన్న కరోనా మహమ్మారి కారణంగా 369 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,30,96,718 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,41,411 కి చేరింది. నిన్న కరోనా నుంచి 39,114 మంది కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,22,64,051 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,91,256 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.