రోడ్డు ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రహదారులన్నీ రక్తపు మడుగులుగా మారిపోతున్నాయి. తాజాగా అతివేగం ఆ యువకుల ప్రాణాలు తీసింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం వెల్లమిల్లి రేవు సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంలో విశాఖకు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు.
గోపాలపురం గ్రామానికి చెందిన బొంతా రవిశేఖర్ (21), విశాఖ జిల్లా మాకవారిపాలెం మండలం రాచపల్లి గ్రామానికి చెందిన రుత్తల సాయి భార్గవ్ (20) తాడేపల్లిగూడెం నుంచి ద్విచక్ర వాహనంపై ఏలూరు బయల్దేరారు. వెల్లమిల్లి రేవు వద్దకు వచ్చే సరికి కల్వర్టు రక్షణ గోడను వేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న భార్గవ్, వెనుక కూర్చున రవి శేఖర్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హైవే అంబులెన్స్ వాహనంలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో ఇద్దరూ మృతి చెందారు.