కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. పంజ్షేర్ మినహా దేశం మొత్తాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్న తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. కాగా, పంజ్షేర్ కూడా తమ వశమైందని తాలిబన్లు శుక్రవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆనందోత్సాహాలతో తాలిబన్లు నిన్న రాత్రికాబూల్లోని పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో చిన్నారులు సహా పలువురు మృతిచెందారని, భారీ సంఖ్యలో గాయపడ్డారని అస్వాకా న్యూస్ ఏజెన్సీ పేర్కొన్నది. గాయపడినవారిని స్థానికులు హుటాహుటిన దవాఖానకు తరలించారని తెలిపింది.
కాగా, పంజ్షేర్ లోయను కూడా ఆక్రమించామన్న తాలిబన్ల ప్రకటనను నార్తర్న్ అలయెన్స్ బలగాలు ఖండించాయి. పంజ్షేర్పై దాడికి దిగిన తాలిబన్ దళాలపై నార్తర్న్ అలయెన్స్ బలగాలు ఎదురుదాడికి దిగాయి, ముష్కరమూకలపై తూటాల వర్షం కురిపించాయి. దాంతో తాలిబన్లు తోకముడుచుకుని వెనుదిరగక తప్పలేదు. ఈ పోరులో తాలిబన్లకు భారీ ప్రాణనష్టం జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది.