సాధారణంగా ప్రెగ్నెన్సీ అంటే మహిళలకు పునర్జన్మలాంటిదని అంటుంటారు. అందుకే ఆ టైంలో ఆడవాళ్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏది తినాలన్నా, ఏం చేయాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు. ఆ తర్వాత పుట్టిన బిడ్డను చూసుకుని ప్రత్యేక అనుభూతిని పొందుతారు. అయితే ఆ ఆనందమే కాదు గర్భంతో ఆడవాళ్లకు ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయని నిపుణులు అంటున్నారు. గర్భం దాల్చే మహిళల ఆయుష్సు, ఆడవాళ్ల మేధా శక్తి పెరుగుతుంది.
వాస్తవానికి గర్భం దాల్చిన మహిళలు డాక్టర్లు చెప్పే సలహాలు, సూచనలు ఫాలో అవుతూ, మందులు వాడుతూ ప్రెగ్నెన్సీకి సిద్ధమవుతారు. ఎటువంటి అడ్డంకులు లేకుండా బిడ్డను ప్రసవించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ సమయంలో శారీరంగా మహిళలు వీక్ అయిపోతారని అందరూ భావిస్తారు. అయితే ఆ సమయంలోనే ఆడవాళ్ల మానసికంగా శక్తివంతులవుతారట.
సాధారణంగా 40 దాటిన తర్వాత గర్భం వస్తే చాలా కష్టమని భావిస్తాం. తల్లీబిడ్డల ఆరోగ్యానికి రిస్క్ అని అనుకుంటాం. కానీ ఆ వయస్సులో ప్రెగ్నెంట్ అయి ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రసవం అయితే.. ఆ తల్లీ ఆయుష్సు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మెదడు శక్తివంతమై మానసికంగా ఆనందంగా ఉండడంతో చాలాకాలం హాయిగా బతికే అవకాశం ఉందట. అంతేకాదు తల్లీ అయిన అతివల్లో అప్రమత్తంగా ఉండే లక్షణం పెరుగుతుందట. పనిమీద శ్రద్ధ పెరుగుతుంది.
బిడ్డను మోస్తున్న తల్లులు ఏ విషయంపైనా శ్రద్ధ పెట్టరని భావిస్తాం. కానీ తల్లులవుతున్న వనితలు ఏదైనా ఈజీగా నేర్చుకుంటారని, వారి మెమరీ పవర్ పెరుగుతుందని పరిశోధనలు, అధ్యయనాలు చెబుతున్నాయి. బిడ్డకు జన్మనివ్వడానికి రెడీ అయిన మహిళల మెదడులో చాలా రకాల మార్పులు జరుగుతాయి. ప్రెగ్నెన్సీ టైంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి అనుగుణంగా మెదడులో కొన్ని రకాల మార్పులు జరుగుతాయి. దాంతో వారి బ్రెయిన్ షార్ప్గా అవుతుందట. ఆ మార్పు చాలాకాలం ఉంటుందట. దీంతో రంగు, రుచి, వాసనలను చాలా తొందరగా గ్రహిస్తారు. అంతేకాదు పసిపిల్లలకు సంబంధించిన అంశాలను ఇతరుల కంటే తొందరగా అర్థం చేసుకుంటారట. అలా ఆ టైంలో మహిళలు మేధస్సు పెరుగుతుందని పరిశోధకులు అంటున్నారు.