మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నానని... చింతమనేనిని తక్షణమే విడుదల చేయాలని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతున్న వారిని వేధించి అక్రమంగా జైలు పాలుజేయడమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై నిరసన తెలిపే హక్కు ప్రతిపక్షాలకు లేదా అని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిని అరెస్ట్ చేయడం.. ప్రభుత్వం సిగ్గుమాలిన చర్య అని ఆయన విమర్శించారు. పౌరస్వేచ్ఛను ఎంతకాలం తొక్కిపెడతారని నిలదీశారు. విశాఖపట్నంలో వివాహ వేడుకకు వెళ్లిన చింతమనేని ప్రభాకర్ను అక్కడికి వెళ్లి మరీ అరెస్ట్ చేయాల్సిన అవసరమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 13 జిల్లాల్లో జగన్ పాదయాత్రను టీడీపీ ప్రభుత్వం అడ్డుకుని ఉంటే మీ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేస్తున్న టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని రాజప్ప మండిపడ్డారు.