కొందరికి సరదాగా చేసే పనులు రూ.లక్షలు తెచ్చిపెడతాయి. ఇలాంటి అదృష్టమే ఆస్ట్రేలియాకు చెందిన ఓ బాలికను వరించింది. తాను తినే చిప్స్లో ఒకటి కాస్త వింతగా ఉండటంతో దాన్ని దాచుకుంది. ఆ తర్వాత దాన్ని వీడియో తీసి టిక్టాక్లో పెట్టడంతో చాలామంది వేలం వేయమని సలహా ఇచ్చారు. దీంతో ఆ బాలిక దాన్ని ఆన్లైన్లో వేలం వేయగా ఏకంగా రూ.14లక్షల ధర పలికింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ నగరానికి చెందిన రైలీ స్టువార్ట్ అనే 13 ఏళ్ల బాలికకు బంగాళాదుంప చిప్స్ అంటే చాలా ఇష్టం. ఆ దేశంలో ప్రముఖ బ్రాండ్ అయిన డోరిటోస్ ఆలూ చిప్స్ అంటే లొట్టలేసుకుంటూ తినేస్తుంది. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం రైలీ డోరిటోస్ ఓ చిప్స్ ప్యాకెట్ కొనుక్కుని తింటోంది. దానిలో ఆమెకు ఓ చిప్ ముక్క వింతగా అనిపించింది. అది మిగతా చిప్స్ ముక్కల్లా కాకుండా సమోసాలాగా ఉబ్బినట్లు ఉంది. వింతగా అనిపించడంతో ఆ బాలిక దాన్ని తినకుండా భద్రంగా దాచుకుంది. తర్వాత దాన్ని వీడియో తీసి టిక్టాక్లో అప్లోడ్ చేసింది. సమోసాలా భిన్నంగా ఉన్న ఈ ఆలూ చిప్ వీడియో తెగ వైరలయ్యింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడంతో రైలీ తెగ ఖుషీ అయిపోయింది.
సమోసాలాగ ఉన్న ఆ చిప్ని వేలం వేస్తే తాము కొనుక్కుంటామని చాలామంది నెటిజన్లు రైలీకి మెసేజ్లు పెట్టారు. దీంతో రిలే ఆ చిప్ ముక్కను ఈబే సైట్లో లిస్ట్ చేసి ధర ఒక్క డాలర్ కంటే తక్కువ కోట్ చేసింది. అయితే ఆశ్చర్యంగా గంటల వ్యవధిలోనే దాని విలువ 2 వేల డాలర్లకు చేరింది. ఆలూ చిప్స్ కోసం ఆన్లైన్ వేలం జరుగుతున్న విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయిన డోరిటోస్ కంపెనీ తాను కూడా బిడ్డింగ్లోకి దిగింది. అందరి కంటే ఎక్కువగా 20,100 డాలర్లు(14,90,251 రూపాయలు) ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఆ మొత్తం చూసి రిలే కుటంబ సభ్యులు షాకైపోయారు. ఏదో సరదాకు చేసిన పనికి రూ.లక్షలు వచ్చిపడతాయని అస్సలు ఊహించలేదని ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతున్నారు.