అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిస్పష్టం చేశారు. దీనిలో భాగంగా 10లక్షల 45వేల కుటుంబాలకు రూ. 905. 57 కోట్లు చెల్లిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. రూ. 20వేల లోపు డిపాజిటర్ల ఖాతాల్లో రూ. 666. 84 కోట్ల నగదు జమ చేశామని పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థ బాధితులకు న్యాయం చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేదని, పేద ప్రజల కోసం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని సీఎం జగన్ అన్నారు.
గుంటూరు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అగ్రిగోల్డ్ డిపాజిట్దారుల బ్యాంకు ఖాతాల్లో పరిహారాన్ని సీఎం జగన్ విడుదల చేశారు. రెండో దశ కింద రూ. 10 వేల నుంచి రూ. 20వేల లోపు 7 లక్షల మంది డిపాజిట్దారులకు రూ. 666. 84 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
మొదటి దశలో రూ. 10 వేల లోపు డిపాజిట్దారులైన 3. 40 లక్షల మందికి 2019లోనే రూ. 238. 73 కోట్లను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. దీంతో మొదటి, రెండో దశలో కలిపి మొత్తం 10. 40 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం రూ. 905. 57 కోట్లు పంపిణీ చేసినట్లు అయింది.