మూత్రపిండాలు శరీరం యొక్క అత్యంత సున్నితమైన, చాలా ముఖ్యమైన అవయవం. ఇటీవల అనేక మంది కిడ్నీ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. అతి తక్కువ వయస్సు ఉన్న వారు కూడా కిడ్నీ వ్యాధులకు గురి కావడం, డయాలసిస్ వరకూ వెళ్లడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఆరోగ్య అలవాట్లు, అజాగ్రత్తల వల్లే ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్, ఉబకాయం, బీపీ తదితర అంశాలు కిడ్నీ వ్యాధులతో ముడిపడి ఉంటాయి. జీవనశైలి , ఆహార పద్ధతులు కిడ్నీ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ నేపథ్యంలో మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు తెలుసుకుని పాటించండి.
ఆహారంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలను నివారించవచ్చు. కానీ ఇప్పటికే మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న వారు పొటాషియం తక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం మంచిది. ఆపిల్, బేరి మరియు బొప్పాయి వంటి పండ్లను ఎక్కువ తినడం మేలు చేస్తుంది. రక్తపోటు, డయాబెటిస్ ఉన్న రోగులకు మూత్రపిండాల సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. మీ కుటుంబంలో రక్తపోటు లేదా డయాబెటిస్ వారసత్వంగా కలిగి ఉంటే, మీరు బీపీని ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలి. బీపీ ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహాతో మందులు వాడాలి. తద్వారా కిడ్నీ వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. నిత్యం వ్యాయామం చేయడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు, ఉబకాయం సమస్యలను నియంత్రించవచ్చు. ఉబకాయం డయాబెటిస్, రక్తపోటుకు కారణమవుతుంది. ఇది క్రమంగా మూత్రపిండాల సమస్యలను కలిగిస్తుంది. వ్యాయామం చేయడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడం చాలా ముఖ్యం. డయాబెటిక్ రోగులకు కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తే చాలా ఇబ్బంది ఎదురవుతుంది. క్రమంగా కిడ్నీలు ఫెయిల్ అవ్వడానికి కూడా కారణమవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు షుగర్ పరీక్షలు చేయించుకుని మందులు, ఆహారంతో షుగర్ ను కంట్రోల్ చేసుకోవడం మంచింది. మూత్ర పిండాల ఆరోగ్యంలో మంచి నీళ్లు తాగడం ముఖ్య పోషిస్తుంది. మీరు ఏ డాక్టర్ ను అడిగినా ఈ విషయం చెబుతారు. పగటి పూట ఎక్కువ మొత్తంలో నీరు లేదా పండ్ల రసాలను తీసుకోవడం మూత్ర పిండాలకు చాలా మంచిది. మూత్రవిసర్జన ఎక్కువగా చేస్తే మూత్రపిండాల్లోని సోడియం, యూరియా కంటెంట్ తగ్గుతుంది. కిడ్నీల్లో రాళ్లు కూడా తయారు కావు.