ఆఫ్ఘనిస్థాన్ మొత్తాన్ని తాలిబన్లు చేజిక్కించుకున్నా వారి అధిపతి హైబతుల్లా అఖుంజాదా ఎక్కడున్నాడన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అయితే, అతడు ఎక్కడున్నాడన్న విషయాన్ని భారత్ పసిగట్టినట్టు తెలుస్తోంది. విదేశీ నిఘా సంస్థలు ఇచ్చిన సమాచారం ఆధారంగా అఖుంజాదా లొకేషన్ ను గుర్తించినట్టు సమాచారం. విదేశీ నిఘా వర్గాలు చెబుతున్న దాని ప్రకారం ప్రస్తుతం అతడు పాకిస్థాన్ సైన్యం అదుపులో ఉన్నట్టు తెలుస్తోందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఆరు నెలలుగా అతడు ఎవరితోనూ మాట్లాడలేదన్నారు. రంజాన్ పండుగ రోజు అతడిచ్చిన సందేశమే ఆఖరుదన్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితుల నేపథ్యంలో అతడిని పాక్ ఎలా హ్యాండిల్ చేస్తుందన్న దానిపైనే ఆసక్తి ఏర్పడిందంటున్నారు. ఇక, ఇటు జైషే మహ్మద్, లష్కరే తాయిబా ఉగ్రవాదులు తాలిబన్లతో మమేకమవుతున్నారని భారత్ కు నిఘా సమాచారం అందినట్టు తెలుస్తోంది. 2016లో అమెరికా చేసిన డ్రోన్ దాడిలో అప్పటి తాలిబన్ అధిపతి అఖ్తర్ మన్సూర్ చనిపోయాడు. దీంతో అదే ఏడాది మేలో మన్సూర్ తర్వాతి స్థానాల్లోని ఇద్దరిలో ఒకడైన హైబతుల్లా అఖుంజాదాను అధిపతిగా నియమించారు. పాకిస్థాన్ లో జరిగిన సమావేశం సందర్భంగా నాడు తాలిబన్లు అతడిని అధిపతిగా నియమిస్తున్నట్టు ప్రకటించారు. అఖుంజాదా న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు.