ఒలింపిక్స్ లో పతకం సాధించడం ప్రతి అథ్లెట్ కల. కానీ ఓ పసి హృదయం కోసం ఒలింపిక్స్లో సాధించిన పతకాన్ని వేలానికి పెట్టి తన పెద్ద మనసు చాటుకుంది పోలండ్ అథ్లెట్ మరియా ఆండ్రెజిక్. మరియా ఆండ్రెజిక్ ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ను 64.61 మీటర్లు విసిరి రజత పతకాన్ని సాధించింది. అయితేనేం తన మనసు బంగారం అని నిరూపించుకుంది.
ఓ ఎనిమిది నెలల పసికందు గుండెకు సమస్య ఏర్పడింది. ఆపరేషన్ కోసం ఆ చిన్నారిని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆస్పత్రికి పంపించాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న మరియా తల్లడిల్లిపోయింది. ఆ చిన్నారి చికిత్సకు అవసరమైన నిధులు సేకరించేందుకు నడుం బిగించింది. అందుకోసం తాను ఒలింపిక్స్ లో సాధించిన రజత పతకాన్ని వేలానికి పెట్టింది.
ఆ పతకాన్ని పొలాండ్ అబ్కా పొల్స్క కన్వీనియెన్స్ స్టోర్ కంపెనీ 1,25,000 డాలర్లకు దక్కించుకొంది. అయితే మరియా మంచి మనసును గౌరవిస్తూ ఆ కంపెనీ ఉదారతను ప్రదర్శించింది. వేలలో గెలిచిన ఆ రజత పతకాన్ని తిరిగి ఆమెకే ఇచ్చేసింది. ఆ చిన్నారి ఆపరేషన్ కు అవసరమైన డబ్బును ఇస్తామని పొలాండ్ అబ్కా పొల్స్క కన్వీనియెన్స్ స్టోర్ కంపెనీ ప్రకటించింది. దీంతో మరియాతో పాటు సదరు కంపెనీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.