ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటితో ముగియనున్న ఉపవాసాలు..

national |  Suryaa Desk  | Published : Thu, May 13, 2021, 10:40 AM

భారత్‌తో పాటు పలు దేశాల్లో రేపు రంజాన్ పర్వదిన వేడుకలు జరగనున్నాయి. 30 రోజులుగా ముస్లింలు చేపట్టిన ఉపవాస దీక్షలు గురువారం (మే 13) తో ముగియనున్నాయి. ఈ రోజు నెలవంక దర్శనం అనంతరం ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు రేపు నిర్వహించనున్నారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఈ వేడుకలు జరగనున్నాయి. అయితే ఒక్క సౌదీ దేశాల్లో మాత్రం ఈ రోజు పండుగను నిర్వహిస్తున్నారు. సౌదీ ఆరేబియాతో పాటు దుబాయ్‌, కువైట్ దేశాల్లో రంజాన్‌ వేడుకులు గురువారమే జరుగుతున్నాయి. శుక్రవారం అన్ని దేశాల్లో పర్వదినాన్ని నిర్వహించనున్నారు.


రంజాన్ ప్రాముఖ్యత..


ఇస్లామిక్ కేలండర్ ప్రకారం రంజాన్… తొమ్మిదో నెలలో వస్తుంది. రంజాన్ పర్వదినానికి చాలా చారిత్రక ప్రాముఖ్యత ఉంది. రంజాన్ నెలలోనే పవిత్ర దివ్య ఖురాన్ గ్రంధం అవతరించింది. ఈ మేరకు ఈ నెలమొత్తం కఠిన ఉపవాస దీక్షలు (రోజా) ఉంటారు. అయితే షవ్వాల్ నెల మొదటి రోజున ఈద్-ఉల్-ఫితర్‌ను జరుపుకుంటారు. ఈ నెలలో ఖురాన్ పఠించడంతోపాటు దాన ధర్మాలు చేస్తారు. నెలవంక కనిపించే రోజును బట్టీ.. ఇది ఒక్కో దేశంలో ఒక్కో సమయంలో నిర్వహిస్తారు. అయితే.. ఈ సారి కూడా కరోనా కారణంగా ఇళ్లలోనే వేడుకలు జరుపుకోవాల్సి వస్తోంది.


 


దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాదిగా కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈద్ ఉల్ ఫితర్‌ వేడుకలను ఇళ్లల్లోనే జరుపుకోవాలని మతపెద్దలు, పలువురు ముస్లిం నాయకులు సూచిస్తున్నారు. సామూహిక ప్రార్థనల వల్ల కరోనా వ్యాప్తి పెరుగుతుందని ఎవరి ఇళ్లల్లో వారే చేసుకోవాలని పేర్కొంటున్నారు. అంతేకాకుండా బహిరంగ ప్రదేశాల్లో కూడా ప్రార్థనలు నిర్వహించవద్దని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సర్క్యూలర్‌ను జారీ చేశాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com