ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్, ఇంగ్లాండ్ పర్యటన కోసం టీమిండియా వెళ్లనున్న నేపథ్యంలో బీసీసీఐ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇంగ్లాండ్ కి బయలుదేరే ముందు ఏ ఆటగాడికి పాజిటివ్ వచ్చినా వారు సిరీస్ మొత్తానికి దూరమవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది.
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్స్, ఇంగ్లాండ్ తో సుదీర్ఘ ఫార్మాట్ కోసం ఇప్పటికే భారత జట్టును ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆటగాళ్లంతా తమ ఇళ్లలోనే ఉన్నారు. సిరీస్ సుదీర్ఘమైంది కావడం, ఐసోలేషన్ వంటి ఆంక్షలు ఉండటంతో కుటుంబ సభ్యులను అనుమతిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఇంగ్లాండ్ కు వీరంతా ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు.
ముంబయికి వచ్చాక 14 రోజులు క్వారంటైన్లో ఉన్నాకే ఆటగాళ్లు విమానం ఎక్కనున్నారు. రాగానే రెండు సార్లు ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తారు. అందులో ఎవరికి పాజిటివ్ వచ్చినా భారత్ లోనే ఉండిపోవాలని, కోలుకున్న తర్వాత ఛార్టర్ విమానాలు ఏర్పాటు చేయబోమని బీసీసీఐ తెగేసి చెప్పిందని సమాచారం. ఇంగ్లాండ్ వెళ్లాక భారత జట్టు ఆటగాళ్లు మరో 10 రోజులు క్వారంటైన్ లో ఉండనున్నారు.
ఇంగ్లాండ్ కు వెళ్లేముందే కరోనా టీకా మొదటి డోసులు తీసుకోవాలని బీసీసీఐ ఆటగాళ్లకు స్పష్టం చేసింది. అందరూ కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పింది. రెండో డోసును బ్రిటన్ లో ఏర్పాటు చేయనుంది. ఎందుకంటే అక్కడా కొవిషీల్డ్ అందుబాటులో ఉండటమే కారణం. ఇప్పటికే కోహ్లీ, ఇషాంత్, రహానె, పుజారా వ్యాక్సిన్ వేయించుకున్నారు. మిగతావారు ఈలోపు పూర్తి చేసుకుంటారు. కాగా క్వారంటైన్ ను కఠినంగా కాకుండా కొన్ని మినహాయింపులు ఇవ్వాలని ఆటగాళ్లు కోరుతున్నట్టు తెలిసింది.