కరోనా వైరస్ కేవలం ఊపిరితిత్తుల వ్యాధి మాత్రమే కాదని, కరోనా కారణంగా రక్తం గడ్డ కడుతోందని, అవయవాలను కాపాడేందుకు ఒక్కోసారి గడ్డలను తొలగించాల్సి వస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకూ జరిగిన అధ్యయనాల ప్రకారం.. ఆసుపత్రుల్లో చేరుతున్న కరోనా బాధితుల్లో 14-28% మంది కాళ్లలోని నాళాల్లో రక్తం గడ్డకడుతోంది. ఇక 2-5% మందికి హృదయ ధమనుల్లో రక్తం గడ్డల్లా పేరుకుపోతోంది. రక్తం గడ్డకట్టడం వల్ల రక్త ప్రసరణలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. 2-5% మంది కరోనా బాధితుల్లో గుండెపోటు, పక్షవాతం, అవయవ నష్టం సంభవిస్తోంది.
తమ ఆస్పత్రిలో వారానికి కనీసం 5-6 కేసుల్లో రక్తం తీవ్రస్థాయిలో గడ్డకట్టే పరిస్థితి కనిపిస్తోందని, కొద్దిరోజులుగా అలాంటి బాధితుల సంఖ్య పెరుగుతోందని ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి సర్జన్ డా.అంబరిష్ సాత్విక్ చెప్పారు. టైప్-2 మధుమేహంతో ఇబ్బందులు పడుతున్న కరోనా బాధితుల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటున్నట్టు ఢిల్లీలోని ఆకాశ్ హెల్త్ కేర్ హృద్రోగ నిపుణుడు అమరీశ్ కుమార్ చెప్పారు. కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ఊపిరితిత్తులకు ఎంత ఇబ్బంది కలుగుతోందో, రక్తనాళాలకు కూడా అంతే హాని జరుగుతోంది అని సాత్విక్ చెప్పారు. కరోనాకు, రక్తం గడ్డకట్టడానికి మధ్య దగ్గరి సంబంధం ఉన్నట్టు ప్రముఖ వైద్య జర్నల్ 'ద లాన్సెట్' ఇప్పటికే పలు అధ్యయనాలను విశ్లేషించింది.