ఓ తండ్రి సభ్య సమాజం తలదించుకునేలా కన్నకూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని స్నేహితులు కూడా కూతురిపై అత్యాచారానికి పాల్పండేందుకు సహకరించాడు. 10 ఏళ్ల వయసులోనే ఇంత నరకం అనుభవించిన బాధిత బాలిక చివరకు స్థానికుల సాయంతో కీచక తండ్రి చెర నుంచి విముక్తి పొందింది. ఈ కేసుకు సంబంధించిన తీర్పును కోర్టు బుధవారం వెలువరించింది. న్యూస్ 18 కథనం మేరకు.. తమిళనాడులోని ఈరోడు జిల్లా గోబి సమీప గ్రామానికి చెందిన 10 ఏళ్ల బాలిక, తన తమ్ముడితో కలిసి తండ్రి వద్ద ఉంటుంది. భర్త వేధింపులు భరించలేక బాలిక తల్లి కొంతకాలం కిందట ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే 2019లో బాలిక తండ్రి, స్నేహితులు అరుణాచలం (35), మణికంఠన్ (33) కలిసి బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయంపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన ఈరోడ్ జిల్లా మహిళా కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. బాలిక తండ్రికి 60 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో దోషులుగా తేలిన అరుణాచలం, మణికంఠన్లకు 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది.