సూరత్లోని వెసు ప్రాంతంలో 100 ఏళ్ల జైన సన్యాసి (సాధ్వీ) ఇటీవల కన్నుమూశారు. ఈమె పార్థివ దేహాన్ని పల్లికిలో మోసుకెళ్తూ అంతిమ యాత్ర నిర్వహించారు శిష్యులు. సాధ్వీ ఇంటి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉమారా శ్మశాన వాటిక వరకు కొనసాగింది. అయితే ఈ యాత్రలో ఒక కుక్క అందర్నీ ఆశ్చర్యపర్చింది. సాధ్వీ చనిపోవడంతో ఆమెను విడిచి ఉండలేక అందరితో పాటు స్మశానం వరకు నడిచి తన విశ్వాసాన్ని చాటుకుంది కుక్క. వెసూ ప్రాంతలోని రామేశ్వరం అపార్ట్మెంట్లో పీయూష్ వర్షా సాధ్వీ మహారాజ్ నివసించేవారు. అదే చోట సదరు కుక్క కూడా నివసించేది. సాధ్వీ నివసించినంత కాలం ఆ కుక్కకు తరచూ ఆహారం అందిస్తుండేంది. దీంతో, ఆ కుక్క తన ఆకలి తీర్చిన యజమాని పట్ల ఎంతో విధేయత చూపించేంది. ఆమె కన్నుమూయడంతో స్థానికులు, ఆమె శిష్యులు కొందరు కలిసి అంతిమ సంస్కారాల కోసం ఏర్పాట్లు చేశారు. సాధ్వీ ఇంటి నుంచి ఉమారా శ్మశానవాటిక వరకు పాల్కీ (అంతిమ) యాత్ర కొనసాగించారు. సాధ్వీ శిష్యులు, అనుచరులతో పాటు ఆ కుక్క కూడా అంతిమ యాత్రలో పాల్గొంది. కుక్కను దూరంగా పంపేందుకు కొందరు ప్రయత్నించారు. కానీ అది మాత్రం యజమానిని వదల్లేదు. మళ్లీ వచ్చి పల్లకి కింద నడవడం మొదలుపెట్టింది. పాల్కీ యాత్ర కొనసాగినంత వరకు అలానే నడిచి యజమాని పట్ల తన విశ్వాసాన్ని చాటుకుంది.