భర్త వేధింపులు తట్టుకోలేక పెళ్ళైన మూడు నెలలకే వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలోని కడప జిల్లాలో జరిగింది. కర్నూలు జిల్లా గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామానికి చెందిన సావిత్రి(21)కి అలంఖాన్పల్లి దస్తగిరిపేటకు చెందిన ప్రతాప్ కు ఈ ఏడాది జనవరిలో వివాహం జరిగింది. అదనపు కట్నం కోసం ప్రతాప్ వేధిస్తుండడంతో మూడు వారాల క్రితం సావిత్రి పుట్టింటికి వెళ్లింది. వారం క్రితం ప్రతాప్ అత్తారింటికి వెళ్లి తన భార్యను పంపించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి.. ఆమెను తన ఇంటికి తీసుకుని వచ్చాడు. తర్వాత తన తల్లి, చెల్లెలితో కలిసి భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో వేధింపులు తాళలేక సావిత్రి ఆదివారం రాత్రి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రతాప్ కు సావిత్రి మూడో భార్య. ప్రతాప్ 2003లో చెన్నూరు మండలం ఖాదర్ఖాన్ కొట్టాలుకు చెందిన మల్లేశ్వరిని వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రతాప్ వేధించడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. తరువాత కోర్టులో కేసు రాజీ అయ్యారు. రెండో వివాహం సావిత్రి అక్క సంజీవరాణితో జరిగింది. కొన్ని రోజులకే మనస్పర్థలు వచ్చి ఆమె దూరంగా ఉంటోంది. రెండేళ్ల క్రితం ప్రతాప్ కువైటుకు వెళ్లాడు. అక్కడి నుంచి సావిత్రితో ప్రేమాయణం సాగించాడు. ఈ ఏడాది జనవరిలో ఆమెను మూడో వివాహం చేసుకున్నాడు.