కరోనా కట్టడి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. రాత్రి 10గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి రాత్రిసమయంలో ప్రయాణించేవారు ఎక్కువగా ఉంటారు. దీంతో ప్రయాణికుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. ఐతే రాష్ట్రాల మధ్య రాకపోకలపై నిషేధం లేనందున కర్ఫ్యూ సమయంలోనూ ఏపీకి రావొచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. బస్సులు, రైళ్ల ద్వారా ఏపీకి వచ్చి ఇళ్లకు వెళ్లేవారికి పోలీసులు అవకాశం కల్పిస్తున్నారు. రాష్ట్రానికి వచ్చిన వారు తమ దగ్గరున్న టికెట్స్ చూపిస్తే ఇంటికి వెళ్లేందుకు అనుమతిస్తారు.
అలాగే రాత్రి సమయంలో తమ వారిని పికప్ చేసుకునేందుకు వెళ్లేవారు సైతం.. వారి బంధువులు, స్నేహితుల ప్రయాణానికి సంబంధించిన ఆధారాలు చూపిస్తే అనుమతిస్తారు. అలాగే సొంత వాహనాల్లో వచ్చేవారిని మాత్రం మెడికల్ ఎమర్జెన్సీ, ఇతర అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తారు. ఐతే వాటికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ గానీ, ఇతర ఆధారాలుగానీ చూపించాల్సి ఉంటుంది.