ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను, పిల్లలను వదిలేసి వెళ్లిపోయిన ఓ మహిళ ప్రియుడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరులో జరిగింది. ప్రీతి కుమారి(25) అనే వివాహిత తన భర్తతో కొన్ని సంవత్సరాలు అన్యోన్యంగానే ఉంది. వారికి ముగ్గురు పిల్లలు పుట్టారు. కొన్నాళ్ల తర్వాత ప్రీతి తన మేనత్త కొడుకు కిరణ్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం ప్రీతి భర్తకు తెలిసింది. దీంతో అతడు తన భార్య ప్రీతిని నిలదీసి.. మళ్లీ ఇది రిపీట్ కాకూడదని హెచ్చరించాడు. భర్త మందలించడంతో ప్రీతి కిరణ్ తో ఇల్లు విడిచి వెళ్లిపోయింది. ఆమె నిర్ణయం ప్రీతి భర్తను విస్మయానికి గురిచేసింది. తమను కాదనుకుని వెళ్లిపోయిన ఆమెను అతడు పట్టించుకోలేదు. పిల్లలను చూసుకుంటూ బ్రతికేస్తున్నాడు.
ప్రీతి తన అత్త కొడుకు కిరణ్తో సినిమాలు, షికార్లంటూ తిరిగింది. కొన్ని రోజుల తర్వాత కిరణ్ లో మార్పు వచ్చింది. ప్రీతిని ఇష్టం లేనట్టుగా దూరం పెట్టాడు. దీంతో ప్రీతి కిరణ్తో పలుమార్లు గొడవ పడింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన కిరణ్.. క్షణికావేశంలో ప్రీతిపై దాడి చేశాడు. కడుపులో తన్నాడు. చేతులు వెనక్కి మడిచి, తలను గోడకేసి కొట్టాడు. దీంతో ప్రీతి తీవ్రంగా గాయపడింది. ఆమె కేకలు, అరుపులు విని స్థానికులు ఆ ఇంటికి వచ్చారు. తల నుంచి రక్తం కారుతున్న స్థితిలో ప్రీతి కనిపించగా.. ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స చేసేలోపే ప్రీతి మృతి చెందింది. ప్రీతిని హత్య చేసిన కిరణ్ కు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. విజయనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.