కరోనా విజృంభణ నేపథ్యంలో దేశంలో ఇప్పటికే పలు పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇటీవలే సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలతో పాటు కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ 'సీఐఎస్సీఈ' నిర్వహించే పదో తరగతి 'ఐసీఎస్ఈ', 12వ తరగతి 'ఐఎస్సీ' పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఇప్పుడు జేఈఈ మెయిన్-2021 మూడో సెషన్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27, 28, 30 తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్షలు జరగాల్సి ఉంది. ఈ పరీక్షలను వాయిదా వేయడంతో ఈ పరీక్షల రీషెడ్యూల్ గురించి కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చాక 15 రోజుల ముందు విద్యార్థులకు సమాచారం అందిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, జీఎఫ్టీఐల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు. తొలి రెండు సెషన్ల పరీక్షలు ఇప్పటికే ముగిశాయి.