ఇటలీలో కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించారు. ఇటలీలోని నేప్లేస్, క్యాంపేనియా వంటి ప్రాంతాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతుండడంతో అక్కడ రెడ్ జోన్లుగా ప్రకటించి పూర్తి లాక్ డౌన్ విధించారు. దీంతో కొద్ది కాలంగా అక్కడ షాపులు తెరుచుకోవడం లేదు. చిరు వ్యాపారుల నుంచి బడా వ్యాపారస్థుల వరకూ లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే, తొలుత ప్రకటించిన ప్రకారం గత వారంతో లాక్ డౌన్ పూర్తి కావాల్సి ఉంది. కానీ, కేసులు ఏ మాత్రం తగ్గకపోవడంతో లాక్ డౌన్ను మరో వారం పాటు పొడిగించారు. ఫలితంగా మళ్లీ అన్ని దుకాణాలు మూసివేతకే పరిమితమయ్యాయి. ఇక నష్టం భరించే శక్తి తమకు లేదంటూ దుకాణదారులు ఎదురు తిరిగారు. లాక్ డౌన్ తొలగించాలని డిమాండ్ చేస్తూ మధ్య చియాయాలోని ఓ షాపింగ్ సముదాయంలో షాపుల యజమానులు మానవ హారం చేపట్టారు. అంతేకాక, వారు మహిళలు, పురుషుల లోదుస్తులైన డ్రాయర్లు, బ్రాలు ప్రదర్శిస్తూ, ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తాము ఇక షాపులకు అద్దెలు, ఇతర బిల్లులు చెల్లించలేమని వాపోయారు.