కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు మంగళవారం చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ సింగు సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలకు దారి తీసింది. సంజయ్ గాంధీ ట్రాన్స్ పోర్ట్ నగర్ వద్ద ట్రాక్టర్ల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరికొన్ని ప్రాంతాల్లో పోలీసులు ఏర్పాటు చేసిన వాటర్ కేన్లను రైతులు ధ్వంసం చేశారు. తమపై ప్రయోగించేందుకు వాటర్ కేన్లను ఏర్పాటు చేసినట్లు భావించిన రైతులు వాటిని తొలగిస్తూ ముందుకు వెళ్తున్నారు.
మరోవైపు ఘాజీపూర్ బారికేడ్లను రైతులు ధ్వంసం చేశారు. దీంతో ఢిల్లీలోని అక్షరథామ్ వద్ద పోలీసులు ట్రాక్టర్లపై తరలివచ్చిన రైతులపై బాష్పవాయుగోళాలను ప్రయోగించారు. ఘాజీపూర్ వద్ద రైతులు బారికేడ్లను విరగగొట్టడంతో పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. సింగు, తిక్రీల సరిహద్దుల్లో బారికేడ్లను రైతులు ధ్వంసం చేశారు. రైతులు ట్రాక్టర్లపై పరేడ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు డ్రోన్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో భారీ భద్రతా సిబ్బందిని మోహరించారు. 6వేల మంది సాయుధ పోలీసులతో పహరా ఏర్పాటు చేశారు.