ఐపీఎల్-2021 సీజన్ కోసం బీసీసీఐ వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఫిబ్రవరి 18 న మినీ ఐపీఎల్ వేలాన్ని నిర్వహించడానికి ప్లాన్ చేస్తోంది. జనవరి 20తోనే ఐపీఎల్ ఆటగాళ్ల రిటెన్షన్ గడువు ముగిసిపోగా ఆయా ఫ్రాంఛైజీలు పలువురు ఆటగాళ్లను కూడా వదులుకున్నాయి. జట్ల మధ్య ప్లేయర్ల ట్రేడింగ్ విండో ఫిబ్రవరి 4న ముగియనుంది.
మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ 18 మంది ఆటగాళ్లను అట్టిపెట్టికుంది. కేదార్ జాదవ్, మురళీ విజయ్, హర్భజన్ సింగ్, పీయూశ్ చావ్లా, మోనూ సింగ్, ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన షేన్ వాట్సన్లను ఫ్రాంఛైజీ విడిచిపెట్టింది.ఇక రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు వదులుకున్న ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్వెల్లను 2021 సీజన్ వేలంలో ఎలాగైనా దక్కించుకోవాలని సీఎస్కే చూస్తున్నట్లు తెలిసింది.
ఇప్పటికే భారత సీనియర్ బ్యాట్స్మన్ రాబిన్ ఊతప్పను ట్రేడింగ్ విండో ద్వారా కొనుగోలు చేసింది సీఎస్కే.ఎలాగైనా స్మిత్, మ్యాక్స్ వెల్ లను జట్టులోకి తీసుకోవాలని ధోనీ ఫ్రాంచైజీకి సూచించాడట.మరోవైపు ఇప్పటివరకు ఐపీఎల్ లో ఆడని ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్ డేవిడ్ మలన్ను కూడా దక్కించుకోవాలని సీఎస్కే చూస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. టీ20 క్రికెట్లో మలన్కు మంచి రికార్డు ఉంది. ఐసీసీ వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాట్స్మన్గా మలన్ కొనసాగుతున్నాడు. ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్ ఆడుతున్నాడు. చెన్నై మాజీ ఓపెనర్ షేన్ వాట్సన్ స్థానాన్ని మలన్తో భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్వెల్తో మిడిలార్డర్ను బలోపేతం చేసుకోవాలనుకుంటోంది. ఐపీఎల్ 2020లో స్మిత్, మ్యాక్స్వెల్ విఫలమయిన విషయం తెలిసిందే. అయినా చెన్నై వారిపై నమ్మకంగా ఉంది
ఏదేమైనా కేదార్ జాదవ్ని చెన్నై వేలంలోకి వదిలేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కెప్టెన్ ఎంఎస్ ధోనీకి జాదవ్ మంచి సన్నిహితుడన్న పేరుంది. ఐపీఎల్ 2020 సీజన్లో ఘోరంగా విఫలమైనా.. మహీ అతడికి వరుసగా తుది జట్టులో అవకాశాలిచ్చాడు. మరి అలాంటి జాదవ్ని చెన్నై వేలంలోకి వదిలేయడమేంటి? అని సందేహాలు వ్యక్తమయ్యాయి. జాదవ్ని గత ఏడాది రూ.7.8 కోట్లకి సీఎస్కే రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2020 సీజన్లో 8 మ్యాచ్లాడిన జాదవ్ కేవలం 62 పరుగులు మాత్రమే చేశాడు.