కొన్ని ఇస్లామిక్ దేశాల్లో చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయి. దొంగతనాలు చేస్తే చేతులు నరికేయడం, అత్యాచారాలకు పాల్పడితే బహిరంగ శిరచ్ఛేదం, రాళ్లతో కొట్టిచంపడం వంటి శిక్షలుంటాయి. తాజాగా పాకిస్థాన్ లోనూ అలాంటి చట్టానికి రూపకల్పన జరుగుతోంది. ఇకపై అత్యాచారానికి పాల్పడిన వారిని రసాయనాల సాయంతో నపుంసకులుగా మార్చేస్తారు. ఈ కఠిన చట్టానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నూతన చట్టం అంశాన్ని పాక్ లోని ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ అత్యాచార నిరోధక ఆర్డినెన్స్ ముసాయిదాను దేశ న్యాయ మంత్రిత్వ శాఖ ఫెడరల్ కేబినెట్ ముందుకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దేశంలో అత్యాచారాల కట్టడికి ఈ కఠిన చట్టం దోహదపడుతుందని భావిస్తున్నారు.