న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం భారత్కు అనుకూలంగా ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచం చైనా వైపు కాకుండా భారత్వైపు చూస్తుందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి తాము సంసిద్ధులమై ఉన్నామని ఆయన పేర్కొన్నారు. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి ఆర్థికవ్యవస్థ కుదేలై ఉన్నా పరిస్థితులు మాత్రం మనకు అత్యంత అనుకూలంగా, చైనాకు ప్రతికూలంగా ఉన్నాయని, ప్రపంచ దేశాలు చైనా కంటే ఇండియాపైనే ఆసక్తి చూపుతున్నాయని గడ్కరీ చెప్పారు. భారత్కే అధిక పెట్టుబడులు రావడానికి ఇది అద్భుత అవకాశం అన్నారు. ఈ అవకాశాన్ని మేం అన్ని విధాల సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమయ్యాం అన్నారు. మరింత పోటీతత్వంతో మరింత నాణ్యతతో ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటామని గడ్కరీ చెప్పారు.