తమ దేశంలో ప్రవాసీల సంఖ్యను తగ్గించుకోవడంలో భాగంగా తీసుకొచ్చిన ప్రవాసీ కోటా ముసాయిదా బిల్లుకు కువైట్ జాతీయ శాసనసభ కమిటీ ఆమోదించింది. కరోనా కారణంగా చమురు ధరలు తగ్గిపోవడంతో కువైట్ ప్రభుత్వం ప్రవాసీ జనాభాను దాదాపు 30శాతానికి తగ్గించుకోవడానికి ఈ బిల్లును రూపొందించింది. ఈ బిల్లు చట్టబద్ద ప్రక్రియ పూర్తయితే అక్కడ నివసిస్తున్న దాదాపు 8లక్షల మంది భారతీయులు స్వదేశానికి తిరిగి రావాల్సి వస్తుంది. ప్రస్తుతం 70శాతంగా ఉన్న ప్రవాసీలను 30శాతానికి తగ్గించాలని అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త బిల్లు ప్రకారం, అక్కడి జనాభాలో భారతీయుల సంఖ్య 15శాతం మించకూడదు. దాదాపు 43లక్షల జానాభా ఉన్న కువైట్లో వివిధ దేశాల ప్రవాసీల సంఖ్య 30 లక్షల మంది ఉన్నారు. వీరిలో అత్యధికంగా భారత్ నుంచే 14లక్షల మంది ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆ దేశ ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లుతో అక్కడ నివసిస్తున్న దాదాపు 8లక్షల మంది భారతీయులు తిరిగి రావాల్సి వస్తుందని అంచనా. కువైట్ ప్రభుత్వ నిర్ణయంతో అక్కడ నివసిస్తున్న భారతీయుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.