బంగాళాఖాతంలో చిక్కుకున్న ఆరుగురు శ్రీలంక మత్స్యకారులను ఇండియన్ కోస్ట్ గార్డ్స్ రక్షించారు. ముంబై, చెన్నైల్లోని మారీటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ల (MRCC) సిబ్బంది ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. వాణిజ్యనౌక YM సమ్మిట్ ద్వారా మత్స్యకారులను ముంబై నౌకాకేంద్రానికి తీసుకొచ్చారు. తమిళనాడుకు తూర్పున 170 నాటికల్ మైళ్ల దూరంలో రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. శ్రీలంకకు చెందిన ఆరుగరు మత్స్యకారులు చేపల కోసం సముంద్రంలోకి రాగా, వారి బోటు బోల్తాపడింది.
దీంతో నాలుగురోజులుగా వారు బోటుపైనే ఉంటూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ నాలుగు రోజులుగా అలలు ఎటు నెడితే బోటు అటే కొట్టుకుపోతూ వచ్చింది. అయితే చెన్నై నుంచి విశాఖపట్నానికి బయలుదేరిన YM సమ్మిట్ మార్గంలో వీరు తారసపడ్డారు. దీంతో నౌకలోని సిబ్బంది చెన్నైలోని MRCCకు సమాచారం ఇవ్వగా వారు ముంబైలోని MRCCకి సమాచారం చేరవేసి శ్రీలంక మత్స్యకారులను రక్షించారు. అనంతరం శ్రీలంక రాయబార కార్యాలాయానికి సమాచారం ఇవ్వగా.. వారు మత్స్యకారులను స్వేదేశానికి పంపడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.