కరోనా చికిత్సకు సంబంధించి యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్(హెచ్సీక్యూ), హెచ్ఐవీ మందులు లోపినావిర్-రిటోనావిర్తో చేస్తున్న ప్రయోగాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) వెల్లడించింది. కరోనా చికిత్సలో ఈ ఔషధాలు ఎంతమేర ఉపయోగపడతాయో తెలుసుకునేందుకు గత కొంతకాలంగా డబ్ల్యూహెచ్వో ఆధ్వర్యంలో పరిశోధన జరుగుతున్న విషయం తెలిసిందే.
అయితే, ఈ ప్రయోగాలకు సంబంధించి ఇటీవల అందిన మధ్యంతర ఫలితాల్లో ఆయా ఔషధాల ప్రభావం అతి తక్కువగా ఉన్నట్లు తేలిందని డబ్ల్యూహెచ్వో వెల్లడించింది. కొన్ని కేసుల్లో అసలు ఎలాంటి ప్రభావం చూపలేదని పేర్కొంది. మరణాల శాతాన్ని తగ్గించడంలో ఇవి ఏమాత్రం సఫలం కాలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అధ్యయనాన్ని వెంటనే నిలిపివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ఆస్పత్రిలో చేరని వారిపై, వైరస్ ముప్పును తప్పించుకునేందుకు ముందు జాగ్రత్త చర్యగా దీన్ని ఉపయోగించవచ్చో.. లేదో.. పరీక్షించేందుకు జరుగుతున్న ప్రయోగాలపై మాత్రం ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేసింది.