ఆ రోజు ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. ఉరుములు మెరుపులతో వర్షం విరుచుకుపడింది. కానీ, అది సాధారణ వర్షం కాదు, రక్తపు వర్షం. ఆకాశంలో మర్డర్ జరిగిందా అన్నట్లుగా కురిసిన ఆ చినుకులు చూసి ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఆ వర్షంలో తడిస్తే రోగాలు వస్తాయేమోనని హడలిపోయారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి.. రక్తపు వానతో ఎర్రబారిన వాకిళ్లు చూసి ఆశ్చర్యపోయారు.2001, సెప్టెంబరు 23న కేరళాలోని కొట్టాయం, ఇదుక్కీ జిల్లాల్లో రక్తపు వర్షం కురిసింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఉరుములు, మెరుపులతో కురిసిన రక్తపు రంగు వర్షాన్ని చూసి ఆశ్చర్యపోయాం. ఆ వర్షం వల్ల చెట్ల ఆకులు కాలిపోయినట్లుగా బూడిద రంగులోకి మారిపోయాయి. దీంతో అంతా ఏదో అరిష్టం జరగబోతుందని అంతా భావించాం’’ అని తెలిపారు.ఈ రక్తపు వర్షం వెనుక ఉన్న మిస్టరీని శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఛేదించలేకపోయారు. ఆ వర్షం ఎందుకలా ఏర్పడింది? స్వచ్ఛంగా ఉండాల్సిన వర్షపు నీరు రంగు మారడానికి కారణం ఏమిటీ? అది రసాయన వర్షమా లేదా బురద? ఇలా ఎన్నో ప్రశ్నలు వారి మదిలో మెదిలాయి. దీని వెనుక గల రహస్యాన్ని తెలుసుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి కొన్ని కారణాలు తెలుసుకోగలిగారు.కేరళలోని సెంటర్ ఫర్ సైన్స్ సంస్థ పరిశోధనల ప్రకారం.. ఈ మిల్లీలీటర్ వర్షపు నీటిలో 9 మిలియన్ ఎర్ర కణాలు ఉన్నాయి. వీటితోపాటు పచ్చ, పసుపు, బూడిద రంగు కణాలు కూడా ఉన్నాయి. నికెల్, మాంగనీస్, టిటానీయం, క్రోమియం, కాపర్ మిశ్రమాల కలయిక వల్ల ఎర్రని కణాలు ఏర్పడి ఉండవచ్చని భావించారు. అయితే, ఇది నూరు శాతం నిరూపితం కాలేదు.విచిత్రమైన విషయం ఏమిటంటే.. వీటిలో లోహ కణాలకు బదులు ఓ విచిత్రమైన జీవ కణాలను కనుగొన్నారు. 2013లో జరిగిన పరిశోధనల్లో ‘ట్రెంటెపోహ్లియా అన్యులాటా’ జాతికి చెందిన నాచులాంటి పదార్థం అందులో ఉందన్నారు. చెట్ల బెరడుకు అంటుకుని విస్తరించే ఈ జీవాలు ఇండియాలో లేకపోవడం గమనార్హం. కేవలం ఆస్ట్రియాలో మాత్రమే ఈ జాతి ఉనికిలో ఉంది. అయితే, అవి చెట్ల మీదుగా మేఘాల్లోకి ఎలా చేరాయనేది మాత్రం తెలియరాలేదు.